Ukraine నుంచి భారత విద్యార్థులు బతుకుజీవుడా అంటూ స్వదేశానికి తిరిగి వస్తుంటే.. మైసూరు యువతి మాత్రం..!
ABN , First Publish Date - 2022-03-06T13:48:34+05:30 IST
రష్యాదాడితో అట్టుడికిపోతున్న ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులు బతుకుజీవుడా అంటూ స్వదేశానికి చేరుకుంటున్నారు.
బెంగళూరు: రష్యాదాడితో అట్టుడికిపోతున్న ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులు బతుకుజీవుడా అంటూ స్వదేశానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో ఎవరికివారు స్వదేశానికో, సురక్షిత ప్రాంతాలకో వెళ్లిపోతున్నారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటుచేసింది. కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందిన శరణ్యశ్రీ ఎంబీబీఎస్ చదివేందుకు కోసం ఉక్రెయిన్ వెళ్లింది.
అయితే ఆమె తనతో పాటు తన పెంపుడు పిల్లి క్రిస్టల్ను కూడా వెంటతెచ్చుకుంది. బాంబుల మోతతో దద్దరిల్లిపోతున్న ఉక్రెయిన్లో పెంపుడు పిల్లిని వదిలి వచ్చేందుకు మనసు అంగీకరించలేదని.. ఆ మూగజీవి కోసం తన బ్యాగేజీలో చాలా భాగాన్ని అక్కడే వదిలేశానని చెప్పింది. క్రిస్టల్ను వెంట తెచ్చుకునేందుకు వీలుగా కొవిడ్ టీకాలు కూడా వేయించానని చెప్పుకొచ్చింది. ఉక్రెయిన్లో మైనస్ డిగ్రీల చలి వద్ద పెరిగిన తన క్రిస్టల్ ఇప్పుడు మైసూరు వాతావరణానికి అలవాటు పడుతుందో లేదోనని శరణ్యశ్రీ ఆందోళన చెందుతోంది.