ఉద్ధవ్ సంచలన నిర్ణయం.. ఈడీ అధికారులపై దర్యాప్తునకు 'సిట్'

ABN , First Publish Date - 2022-04-06T00:50:14+05:30 IST

ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం సంచలన..

ఉద్ధవ్ సంచలన నిర్ణయం.. ఈడీ అధికారులపై దర్యాప్తునకు 'సిట్'

ముంబై: ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఏజెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసింది. కొందరు ఈడీ అధికారులు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇప్పటికే ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు సంబంధించి 'సిట్'ను ఉద్ధవ్ సర్కార్ ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర హోం శాఖ మంత్రి దిలీప్ వాల్షే పాటిల్ మీడియాతో మాట్లాడుతూ, వీరేష్ ప్రభు అనే అధికారి నేతృత్వంలో సిట్ పని చేస్తుందని చెప్పారు. నిర్దేశిత గడువులోగా దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు.


సంజయ్ రౌత్ గత నెలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొందరు ఈడీ అధికారులు కొందరిపై విమర్శలు చేశారు. కొందరు అధికారులు బీజేపీకి 'ఏటీఎం'లుగా  పని చేస్తున్నారని అన్నారు. నలుగురు ఈడీ అధికారులపై బలవంతపు వసూళ్ల ఆరోపణలపై ముంబై పోలీసులు దర్యాప్తు జరుపనున్నారని, వీరిలో కొందరు జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. అయితే, ఆ అధికారుల పేర్లను మాత్రం సంజయ్ రౌత్ వెల్లడించలేదు.


కాగా, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద మంగళవారంనాడు సంజయ్‌రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ప్రొవిజినల్ అటాచ్‌మెంట్‌ను ఈడీ జారీ చేసింది. ఈ క్రమంలోనే అవినీతి ఆరోపణలపై పలువురు ఈడీ అధికారులపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు మహారాష్ట్ర సర్కార్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - 2022-04-06T00:50:14+05:30 IST