48 గంటల్లో నివేదిక ఇవ్వాలి
ABN , First Publish Date - 2020-08-10T09:44:10+05:30 IST
అగ్నిప్రమాద ఘటనపై విచారణకు హోం, వైద్య ఆరోగ్య శాఖలు వేర్వేరుగా కమిటీలను నియమించాయి. రాష్ట్రవ్యాప్తంగా క్వారంటైన్ కేంద్రాలుగా
- అగ్నిప్రమాదంపై విచారణకు కమిటీలు
అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): అగ్నిప్రమాద ఘటనపై విచారణకు హోం, వైద్య ఆరోగ్య శాఖలు వేర్వేరుగా కమిటీలను నియమించాయి. రాష్ట్రవ్యాప్తంగా క్వారంటైన్ కేంద్రాలుగా వినియోగిస్తున్న భవనాల భద్రత కోసం మార్గదర్శకాలు రూపొందించేందుకు హోంశాఖ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డీజీని చైర్మన్ కం కన్వీనర్గా, ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ డైరెక్టర్, ఎలక్ట్రికల్ చీఫ్ఇన్స్పెక్టర్ సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ స్వర్ణప్యాలెస్లో అగ్నిప్రమాదంపై విచారించి నివేదిక ఇవ్వాలని, రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్-19 క్వారంటైన్ కేంద్రా ల్లో తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలను రెండురోజుల్లో రూపొందించాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజీత్ పేర్కొన్నారు. అలాగే, అగ్నిప్రమాద ఘటనపై విచారణకు కమిటీని నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వును జారీచేసింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్టు సీఈవో, పబ్లిక్హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ల కమిటీ విచారణ చేపట్టాలని సూచించింది. రమేష్ హాస్పిటల్, ఆ ఆస్పత్రి నిర్వహించే కొవిడ్ కేంద్రాల్లో బాధితుల పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలపై 48గంటల్లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.