దళితబంధుతో ఆర్థికంగా ఎదగాలి
ABN , First Publish Date - 2022-05-17T05:39:51+05:30 IST
దళితబంధు పథకంతో తమ కాళ్లపై తాము నిలబడడమే కాకుండా పదిమందికి ఉపాధి కల్పించేలా ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
- మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, మే 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దళితబంధు పథకంతో తమ కాళ్లపై తాము నిలబడడమే కాకుండా పదిమందికి ఉపాధి కల్పించేలా ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద దళితబంధు లబ్ధిదారులైన వడ్లూరి శ్రావణ్ మొబైల్స్ సేల్స్ అండ్ సర్వీస్ షాపును, సుభాష్నగర్ వద్ద కాడె రాజశేఖర్ లైటింగ్ అండ్ టెంట్హౌస్ను, గాంధీ రోడ్ వద్ద గసికంటి అరుణ్ కుమార్ ఎలక్ర్టికల్స్ షాపును ఏర్పాటు చేసుకున్నారు. ఈ షాపులను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు పథకం అమలు చేస్తుందని అన్నారు. దళితబంధు పథకం ద్వారా మంజూరైన యూనిట్లను సక్రమంగా నడిపించుకుంటూ ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. ఈ సందర్భంగా దళితబంధు పథకం ద్వారా లబ్దిపొందిన వారిన మంత్రి యూనిట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మంత్రి పద్మనగర్లోని గిరిజన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కు భూమిపూజ, శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజయ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ వై సునీల్రావు, కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు, సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.