భక్తి శ్రద్ధలతో మిలాద్-ఉన్-నబీ
ABN , First Publish Date - 2021-10-19T05:30:00+05:30 IST
మిలాద్-ఉన్-నబీ (మహ్మద్ ప్రవక్త జన్మదినం) వేడుకలను మండలంలోని ముస్లింలు మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.
ర్యాలీలు నిర్వహించిన ముస్లింలు
కశింకోట, అక్టోబరు 19: మిలాద్-ఉన్-నబీ (మహ్మద్ ప్రవక్త జన్మదినం) వేడుకలను మండలంలోని ముస్లింలు మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. బయ్యవరం అన్సర్ మద్నీ ఔలియా దర్గా నుంచి కశింకోటలోని నూరీ మసీదు వరకు ఊరేగింపు నిర్వహించారు. నర్సింగబిల్లి, బయ్యవరం, కశింకోట దర్గాల్లో సామూహిక ప్రార్థనలు చేశారు. మతగురువులు మౌలానా, జాఫర్ పర్వేజ్లు మహ్మద్ ప్రవక్త జన్మ విశిష్టత, ఖురాన్లోని ముఖ్య ఘట్టాల గురించి విశదీకరించారు.
అనకాపల్లిలో...
అనకాపల్లిటౌన్: పట్టణంలో ముస్లింలు మంగళవారం మిలాద్-ఉన్-నబీ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జామియా మసీదు అధ్యక్షుడు హుస్సేన్ ఆధ్వర్యంలో చిననాలుగురోడ్ల జంక్షన్లోని మసీదు నుంచి మెయిన్రోడ్డు మీదుగా ఊరేగింపు నిర్వహించారు. టీడీపీ నాయకుడు మళ్ల సురేంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.