బహిరంగ ప్రార్థనలు రద్దు!
ABN , First Publish Date - 2021-05-13T05:18:40+05:30 IST
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రంజాన ప్రార్థనలకు కొన్ని నియమ నిబంధనలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
‘రంజాన’ కొవిడ్ నిబంధనలు
పెద్ద మసీదుల్లో 50 మందికే అనుమతి
నెల్లూరు (సాంస్కృతికం), మే 12 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రంజాన ప్రార్థనలకు కొన్ని నియమ నిబంధనలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రతులను జిల్లా అధికారులు ప్రతి మసీదు నిర్వాహకులకు అందచేశారు. ఈ మేరకు ముస్లిం పెద్దలు కూడా సానుకూలంగా స్పందించారు. నెల్లూరులోని బారాషహీద్ ఈద్గాలో రంజాన ప్రార్థనలు రద్దు చేసినట్లు ముస్లిం పెద్దలు, ఈద్గా కమిటీ సభ్యులు తెలిపారు. బుధవారం విలేకరులతో వారు మాట్లాడుతూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మసీదులలో ప్రార్థనలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బారాషహీద్ దర్గా చైర్మన అబ్దుల్ రజాక్, ఈద్గా కమిటీ ప్రెసిడెంట్ షకీల్, మత పెద్దలు పాల్గొన్నారు.
కర్ఫ్యూ, 144 సెక్షన అమలులో ఉన్నందున రంజాన ప్రార్థనలను ఉదయం 6 నుంచి 12 గంటల్లోపు ముగించాలి.
బహిరంగ ఈద్గా ప్రాంతాల్లో ఈద్ ఉల్ ఫితర్ నమాజులను నిషేధించారు.
ప్రతి ఒక్కరూ ఇంటి వద్దే భౌతిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేసుకోవాలి.
మసీదుల్లో ప్రార్థనలు చేసుకునే వారు 50 మందికి మించకుండా భౌతిక దూరం పాటిస్తూ 2 మాస్కులు ధరించి రావాలి. 50 మంది చొప్పున బ్యాచలుగా వచ్చి నమాజు చేసుకోవాలి.
మసీదులో నమాజు చేసుకునేందుకు వచ్చే ప్రతి ఒక్కరూ ఇంటిలో వజూ చేసుకొని జానిమాజ్ తీసుకురావాలి.
మసీదుల ద్వారాల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్కరూ చేతులకు శానిటైజ్ చేసుకొని మసీదులోకి వెళ్లాలి.
తక్కువ సమయంలోనే ఈదుల్ ఫితర్ ప్రార్థనలు చేయాలి.
వయోవృద్ధులు, పిల్లలు, దగ్గు, జలుబు, జ్వరం కలిగిన వారిని మసీదుల్లో అనుమతించరు. అలాగే డయాబెటీస్, బీపీ, షుగర్, కరోనా లక్షణాలు ఉన్న వారికీ నో ఎంట్రీ!
ప్రార్థనలు అనంతరం చేతులు కలపడం, ఒకరినొకరు ఆలింగనం (ముసాఫా) చేయడం, బంధువులను కలవడం, ఈద్మిలాబ్ వంటి కార్యక్రమాలను నిషేధించారు.