మురికి కూపాలుగా గ్రామాలు
ABN , First Publish Date - 2022-08-11T06:08:20+05:30 IST
మురికి కూపాలుగా గ్రామాలు
ఫ రోడ్లపై మురుగు నీటి నిల్వ ఫ దోమలకు ఆవాసంగా మారిన వైనం
పెదపారుపూడి, ఆగస్టు 10 : మండలంలోని పలు గ్రామాల్లో దోమలు విపరీతంగా పెరిగి గ్రామస్థులు టైపాయిడ్, మలేరియా వంటి వ్యాధులకు గుర వుతున్నారు. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆర్ఎంపీ డాక్టర్ల వద్ద జ్వర పీడితులతో ప్రతీరోజు పదుల సంఖ్యలో రోగులు వైద్యం పొందుతున్నారు. ఇంత మంది అనారోగ్యం పాలవుతున్నా అధికారులు మాత్రం పారిశుధ్యంపై చర్యలు తీసుకోకపోవటంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఆయా గ్రామాల్లో రోడ్లపై మురుగునీరు నిల్వ ఉండి మురికి కుపాలుగా మారి దోమలకు ఆవాస యోగ్యంగా మారాయి. వర్షం తగ్గినా రోడ్లపై మురుగునీరుపోయే మార్గం లేకపోవటంతో వివిధ రకాల వ్యాధులను కలిగించే దోమలు విపరీతంగా పెరిగాయి. చీకటి పడితే చాలు దోమల దాడి ఎక్కువగా ఉంటుందని గ్రామస్థులు అంటున్నారు. దీంతో గ్రామాల్లో మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాలు వ్యాపిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించకపోవటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ డాక్టర్ల వద్దకు వైద్యం కోసం వెళ్తే టెస్టులు పేరుతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెడికల్ షాపు దుకాణాలను తనిఖీ చేయా ల్సిన అధికారులు కార్యాలయానికి పరిమితమై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా మండల స్థాయి అధికారులు, గ్రామస్థాయి అధికారులు హెల్త్ అధికారులు గ్రామాలపై దృష్టిసారించి పారిశుధ్య మెరుగుదలకు చర్యలు చేపట్టాలని మెడికల్ షాపులో దోచుకునే దోపిడీని అరికట్టాలని కోరుతున్నారు.