మతిస్థిమితం లేని మహిళపై హత్యాచారం
ABN , First Publish Date - 2022-06-28T04:57:07+05:30 IST
మండలంలోని శివాయిపల్లి గ్రామ శివారులో అనుమానాస్పద స్థితిలో లభ్యమైన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు.
ఇద్దరు నిందితుల అరెస్టు
వారం రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు
మెదక్ ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని వెల్లడి
పెద్దశంకరంపేట, జూన్ 27: మండలంలోని శివాయిపల్లి గ్రామ శివారులో అనుమానాస్పద స్థితిలో లభ్యమైన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. సోమవారం సాయంత్రం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పోలీ్సస్టేషన్లో విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. పెద్దశంకరంపేట మండలంలోని శివాయిపల్లి గ్రామానికి చెందిన మహిళ కుక్కల లక్ష్మి(35) మానసిక వైకల్యంతో బాధపడేది. ఈ నెల 16న రాత్రి ఆమె గ్రామ శివారులోని టీస్టాల్ వద్ద ఉన్న గుడిసెలో కూర్చుని ఉన్నది. సమీప రైస్మిల్లులో పని చేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వలస కూలీలు సీహెచ్ ముఖియా, సంజిత్రిషిదేవ్ అదే రాత్రి మద్యం తాగి మహిళ వెంట పడ్డారు. గుడిసెలో కూర్చున్న లక్ష్మిపై మొదటగా ముఖియా అత్యాచారం చేయడానికి యత్నించగా, ఆమె ప్రతిఘటించి అక్కడి నుంచి బయటికి వచ్చి శివాయిపల్లి గ్రామం వైపు కాలినడకన బయలుదేరింది. నిందితులిద్దరు మృతురాలిని అనుసరించి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి అనంతరం ఆమెను హత్య చేశారు. ఈ విషయం బయటకు తెలిస్తే దొరికిపోతామని భయంతో లక్ష్మి మృతదేహాన్ని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి పంటపొలంలో పూడ్చి పెట్టారు. ఈ నెల 21న వర్షం కురియడంతో మహిళ కాలు, చేయి బయటకు తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించిన విషయం తెలిసిందే. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారం రోజుల్లోనే కేసును ఛేదించారు. కేసు విచారణలో కీలక పాత్ర పోషించిన పోలీసులను ఎస్పీ అభినందించి రివార్డు అందజేశారు. సమావేశంలో మెదక్ డీఎస్పీ సైదులు, అల్లాదుర్గం, మెదక్ రూరల్ సీఐలు జార్జ్, విజయ్కుమార్, పెద్దశంకరంపేట, రేగోడు, టేక్మాల్, అల్లాదుర్గం, ఎస్ఐలు బాల్రాజ్, సత్యనారాయణ, లింగం, రవీందర్, సీసీ ఎస్ఐగోపినాథ్, పోలీసు సిబ్బంది ఉన్నారు.