ఇద్దరి మధ్య వివాదం.. ఒకరి హత్య
ABN , First Publish Date - 2022-01-21T06:12:30+05:30 IST
ఇద్దరి మధ్య వివాదం.. ఒకరి హత్య
విద్యాధరపురం, జనవరి 20 : ఇద్దరి మధ్య జరిగిన వివాదంలో మూడో వ్యక్తి కలగజేసుకోవడంతో పాటు గొడవపడి ఒకరిని రాయితో కొట్టి హత్య చేసిన సంఘటన విద్యాధరపురం సితార సెంటర్లో బుధవారం రాత్రి జరిగింది. సరుగు శ్రీనివాసరావు (53) తన సొంత మినీ వ్యాన్లో ఫ్లిప్కార్ట్ కిరాయికి తిప్పుతుంటాడు. బుధవారం రాత్రి 8 గంటలకు సితార సెంటర్ వద్ద శ్రీనివాసరావు తన వాహనాన్ని యూటర్న్ తీసుకుంటుండగా, ఒక వ్యక్తి అడ్డు వచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ముక్తా రవి అలియాస్ ఈశ్వర్ వారిద్దరినీ విడదీసి కొంచెం దూరంలోకి వెళ్లి నిలబడ్డాడు. అయితే శ్రీనివాసరావు మళ్లీ అతడి వద్దకు వెళ్లి మాట్లాడగా, ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తోపులాటలో రవి కింద పడిపోయాడు. కోపంతో ఉన్న రవి రాయి తీసుకుని శ్రీనివాసరావు తలపై గట్టిగా కొట్టాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న బంధువులు చికిత్స నిమిత్తం శ్రీనివాసరావును ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మంగళ గిరిలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించగా, గురువారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.