ఆస్తి కోసం తండ్రి హత్య
ABN , First Publish Date - 2022-07-25T16:56:36+05:30 IST
ఆస్తి కోసం కన్న తండ్రిని కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడో కుమారుడు. ఈ సంఘటన బేగంపేట పోలీ్సస్టేషన్ పరిధి పైగా కాలనీలోని
హైదరాబాద్/బేగంపేట: ఆస్తి కోసం కన్న తండ్రిని కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడో కుమారుడు. ఈ సంఘటన బేగంపేట పోలీ్సస్టేషన్ పరిధి పైగా కాలనీలోని విమన్నగర్లో ఆదివారం జరిగింది. ఎస్సై శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ తీసుకున్న అబ్రహం లింకన్ (84)కు మొదటి భార్య చనిపోవడంతో రెండోపెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు ముగ్గురు పిల్లలు. కాగా, వారిలో ఇద్దరు చనిపోయారు. రెండో భార్యకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెండో భార్యతో లింకన్కు విభేదాలు ఉండడంతో బేగంపేటలోని విమన్నగర్లో ఉన్న హాస్టల్లో ఒంటరిగా ఉంటున్నారు. ఆయనకు నిజాంపేట, లింగంపల్లిలో రెండు ప్లాట్లు, షాద్నగర్లో ఐదెకరాల పొలం ఉన్నాయి. ఆస్తి తనపేర రాయాలని కొంతకాలంగా రెండో భార్య కుమారుడు కిరణ్(30) తరచూ లింకన్ను వేధిస్తూ వచ్చాడు.
ఇందుకు ఆయన నిరాకరించడంతో నకిలీ పత్రాలతో నిజాంపేట, లింగంపల్లిలో ఉన్న రెండు ప్లాట్లను కిరణ్ మరొకరికి విక్రయించాడు. విషయం తెలుసుకున్న లింకన్ న్యాయస్థానంలో కేసు వేయడంతో కోర్టు తీర్పు అతనికి అనుకూలంగా వచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన కిరణ్ ఆదివారం ఉదయం లింకన్ ఉన్న హాస్టల్కు వచ్చి తండ్రితో గొడవకు దిగాడు. వెంట తెచ్చుకున్న కొబ్బరి బొండాల కత్తితో మెడ, నడుము, పొట్టపై విచక్షణా రహితంగా నరికి పరారయ్యాడు. హాస్టల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని చికిత్స నిమిత్తం లింకన్ను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. మొదటి భార్య కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.