పురివిప్పిన పాత కక్షలు
ABN , First Publish Date - 2021-07-28T05:11:50+05:30 IST
తన కుటుంబంలోని వ్యక్తిని హతమార్చారన్న కక్షతో రగిలిపోయారు.... పక్కా ప్లాన్తో కత్తులతో పొడిచి చంపారు. ఫ్యాక్షన్ కథలా ఉన్న ఈ ఘటన మంగళవారం నెల్లూరు నగరంలో జరిగింది.
వ్యక్తి దారుణ హత్య
నెల్లూరు(క్రైం), జూలై 27: తన కుటుంబంలోని వ్యక్తిని హతమార్చారన్న కక్షతో రగిలిపోయారు.... పక్కా ప్లాన్తో కత్తులతో పొడిచి చంపారు. ఫ్యాక్షన్ కథలా ఉన్న ఈ ఘటన మంగళవారం నెల్లూరు నగరంలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. బుజబుజనెల్లూరు ప్రాంతంలో సంపత్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. దేవా, వెంకటేశ్వర్లు అనే అన్నదమ్ములు అతనితో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో దేవా, వెంకటేశ్వర్లు బహిరంగంగా మద్యం సేవిస్తుండగా పోలీసులు వచ్చి హెచ్చరించారు. స్థానికుడైన మురుగన్ భాస్కర్ అనే వ్యక్తే పోలీసులకు సమాచారం ఇచ్చాడన్న అనుమానంతో దేవా, వెంకటేశ్వర్లు, మరో ఇద్దరు కలిసి భాస్కర్ను కత్తులతో పొడిచి హత్య చేశారు. అప్పటి నుంచి భాస్కర్ కుటుంబ సభ్యులు నిందితులపై కక్ష పెంచుకున్నారు. అయితే భాస్కర్ హత్యతో సంపత్కు ఎటువంటి సంబంధం లేకపోయినా హత్య చేసిన నలుగురు యువకులకు సంపత్ ఆర్థికంగా సహయపడుతుండటంతో అతనిపైనా కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సంపత్ ఇంటికి వెళుతుండగా భాస్కర్ కుటుంబ సభ్యులు సూర్య, మునుస్వామి, మరికొందరు కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. సంపత్ వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సమీపంలో ఉన్న మెడికల్ షాపులోకి వెళ్లాడు. అయినా వారు వదిలిపెట్టకుండా మెడికల్ షాపులోకి చొరబడి కత్తులతో సంపత్ను తీవ్రంగా గాయపరిచి పరారయ్యారు. సమాచారం అందుకున్న వేదాయపాళెం ఇన్స్పెక్టర్ పీ రామకృష్ణ, ఎస్ఐ లక్ష్మణరావు ఘటనా స్థలానికి చేరుకుని సంపత్ను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంపత్ మృతి చెందాడు. ఇన్స్పెక్టర్ రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.