రూ. 720 విషయమై గొడవ సంబంధంలేని వ్యక్తి హత్య

ABN , First Publish Date - 2021-03-27T16:08:39+05:30 IST

రూ.720 కోసం తలెత్తిన వివాదంలో గొడవతో ఏ సంబంధం లేని వ్యక్తి..

రూ. 720 విషయమై గొడవ సంబంధంలేని వ్యక్తి హత్య

హైదరాబాద్/హయత్‌నగర్‌ : రూ.720 కోసం తలెత్తిన వివాదంలో గొడవతో ఏ సంబంధం లేని వ్యక్తి హత్యకు గురయ్యాడు. హయత్‌నగర్‌ పోలీసుల కథనం ప్రకారం.. హయత్‌నగర్‌ పుల్లారెడ్డి స్వీట్‌ హౌస్‌ ముందు జాతీయ రహదారిపైన పండ్ల వ్యాపారం నిర్వహించే తిప్పగల్ల సుభాష్‌ గురువారం రాత్రి హయత్‌నగర్‌ బస్‌ డిపో సమీపంలోని మద్యం షాపునకు వెళ్లాడు. అక్కడ గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు పరిచయం అయ్యారు. మందుకు రూ. 720 కావాలి, ఏటీఎంకు వెళ్లి తీసుకువచ్చి ఇస్తామని సుభాష్‌‌ను నమ్మించారు. సుభాష్‌ వారికి రూ. 720 ఇచ్చాడు. వారు ఏటీఎంకు వెళ్లకుండా కాలయాపన చేస్తున్నారు. సుభాష్‌ ఆగ్రహించి వారిని కొట్టి స్కూటీని లాక్కుని వచ్చి పండ్లు విక్రయించే తోపుడు బండి వద్ద పెట్టాడు. 


తన వద్ద పని చేస్తున్న దొడ్డి మధుసూదన్‌రెడ్డి, ఆనంద్‌, నర్సింహ్మలకు అప్పగించి సుభాష్‌ తన ఇంటికి వెళ్లిపోయాడు. స్కూటీకి సంబంధించిన వ్యక్తులు వస్తే రూ. 720 తీసుకుని ఇచ్చేయమని చెప్పాడు. రాత్రి 12.30 గంటల ప్రాంతానికి సుభా్‌షతో దెబ్బలు తిన్న ఆ ముగ్గురు వ్యక్తులు తమ అనుచరులతో వచ్చి స్కూటీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మధుసూదన్‌రెడ్డి, నర్సింహ్మ, ఆనంద్‌ డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై వారి మధ్య గొడవ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తోపుడు బండిపైన ఉన్న కర్రలు లాక్కుని నర్సింహ్మ, ఆనంద్‌, మధుసూధన్‌రెడ్డిపై దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో వారు పరుగులు తీశారు. 


దుండగులు మధుసూధన్‌రెడ్డిని పట్టుకుని ముఖంపైన, తలపైన కర్రతో దాడి చేయడంతో అక్కడిక్కడే మృతి చెందాడు, నర్సింహ్మకు కాలు విరిగింది. మధుసూధన్‌రెడ్డి అనంతపురం జిల్లా నారాయణపురానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఆయనకు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. మధుసూధన్‌రెడ్డి గతంలో పెయింటర్‌గా పనిచేసే వాడు. బాధితుల ఫిర్యాదు మేరకు హయత్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి మూడు ప్రత్యేక బృందాలను పంపినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ సందర్శించారు.

Updated Date - 2021-03-27T16:08:39+05:30 IST