బైకు వెనుక కూర్చుని అల్లుడిని కత్తితో పొడిచిన మామ
ABN , First Publish Date - 2021-06-07T18:23:56+05:30 IST
ప్రేమ పేరుతో కూతురిని తప్పుదోవ పట్టించి పెళ్లి చేసుకోవడమే
- పట్టపగలే హత్య
- పెళ్లయి పిల్లలుండి కూడా తన కుమార్తెను పెళ్లాడడమే కారణం
- ఫలక్నుమాలో కలకలం
హైదరాబాద్ సిటీ/చాంద్రాయణగుట్ట : ప్రేమ పేరుతో కూతురిని తప్పుదోవ పట్టించి పెళ్లి చేసుకోవడమే కాకుండా, తనను వేధింపులకు గురి చేస్తుండడంతో మామ అల్లుడిని చంపేశాడు. ఇన్స్పెక్టర్ ఆర్.దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం... ఫలక్నుమా అన్సారీ రోడ్డుకు చెందిన అబ్దుల్ షారూఖ్(24) ఆటోడ్రైవర్. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ మైలార్దేవ్పల్లికి చెందిన అన్వర్ కుమార్తెను 2020 మే నెలలో ప్రేమ పేరుతో వేధించడంతో నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో జైలుకెళ్ళిన షారూఖ్ ఇటీవలే విడుదలయ్యాడు.
తాజాగా ఆ యువతిని తల్లిదండ్రులకు తెలియకుండా నిఖా చేసుకున్నాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులకుఫోన్ చేసి తన భార్యను కాపురానికి పంపించాలని వేధిస్తున్నాడు. పెళ్ళి అయి, ముగ్గురు పిల్లలున్న షారూఖ్ తన కుమార్తెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని అన్వర్ అల్లుడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం శాలిబండకు వెళ్దామని షారూఖ్కు ఫోన్ చేసి పిలిచాడు. వాహనం ఫారూఖ్ నడుపుతుండగా, వెనక అన్వర్ కూర్చున్నాడు.
బస్డిపో వద్దకు రాగానే మధ్యాహ్నం 12.30 సమయంలో తన వద్ద ఉన్న కత్తితో ఫారూఖ్పై అన్వర్ దాడి చేయ బోయాడు. దీంతో షారూఖ్ వాహనాన్ని వదిలేసి పరుగులు పెట్టాడు. కొద్దిదూరం వరకు వెంబడించిన అన్వర్ కత్తితో షారూఖ్ గొంతుపై వేటు వేశాడు. దీంతో అతను కొద్దిదూరం వెళ్ళి నడిరోడ్డుపై పడి రక్తం మడుగులో ప్రాణాలు వదిలాడు. ఫలక్నుమా ఏసీపీ ఎం.ఎ మాజిద్, ఇన్స్పెక్టర్ దేవేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.