మద్యం ఇప్పించలేదని పొడిచేశాడు

ABN , First Publish Date - 2021-07-28T05:31:24+05:30 IST

మూలాపేటలోని లేక్‌ వ్యూ బార్‌లో మద్యం ఇప్పించలేదని ఓ వ్యక్తి మరొకరిని కత్తితో గాయపరిచాడు.

మద్యం ఇప్పించలేదని పొడిచేశాడు
రక్తస్రావంతో బలరామయ్య

బార్‌లో రక్తస్రావం

నెల్లూరు(క్రైం), జూలై 27: నెల్లూరు నగరంలో రోజురోజుకు శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. వరుస హత్యలు, హత్యాయత్నాలు ప్రజలను భయాందోళ నకు గురి చేస్తున్నాయి. తాజాగా మూలాపేటలోని లేక్‌ వ్యూ బార్‌లో మద్యం ఇప్పించలేదని ఓ వ్యక్తి మరొకరిని కత్తితో గాయపరిచాడు. పోలీసుల కథనం, సేకరించిన సమాచారం మేరకు... మూలాపేటలోని రామిరెడ్డి బంగళా పక్కన ఆకుల బలరామయ్య కుటుంబం నివసిస్తోంది. ఆయన సోఫా రిపేర్లు చేసుకుంటూ కుటుం బాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం లేక్‌ వ్యూ బార్‌లో మద్యం సేవించేందుకు వెళ్లాడు. అతని వద్ద గతంలో పనిచేసిన రాజేష్‌ అనే వ్యక్తి కూడా అక్కడి వచ్చాడు. తనకో క్వార్టర్‌ మందు ఇప్పించాలని కోరాడు. అయితే డబ్బులు లేవని బలరామయ్య చెప్పడంతో రాజేష్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ వచ్చి క్వార్టర్‌ మందు తీసివ్వమని బలరామయ్యను అడగడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రాజేష్‌ తన జేబులోని కత్తితో బలరామయ్య కణతపై బలంగా గాయపరిచి పరారయ్యాడు. కత్తి లోతుగా దిగడంతో బలరామయ్యకు తీవ్ర రక్తస్రావం అయింది. ఆయన రక్తం కారుతుండగానే నడుచుకుంటూ రోడ్డుపై వెళ్లడం చూసి ప్రజలు భయంతో పరుగులు తీశారు. అలా దగ్గరలోని నాలుగు రోడ్ల కూడలి వరకు వెళ్లిన బలరామయ్య అక్కడ పడిపోయాడు. సమాచారం అందుకున్న చిన్నబజారు ఎస్‌ఐ ఆలీసాహెబ్‌ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.  హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బలరామయ్య ఆరోగ్యంగానే ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-07-28T05:31:24+05:30 IST