భూ వివాదంలో తమ్ముడి చేతిలో అన్న హత్య
ABN , First Publish Date - 2021-07-19T05:31:22+05:30 IST
భూవివాదం నేపధ్యంలో సొంత అన్ననే తమ్ముడు నరికి హత్య చేసిన సంఘటన అశ్వారావుపేట మండలం జమ్మిగూడెంలో ఆదివారం రాత్రి జరిగింది.
అశ్వారావుపేట మండలం జమ్మిగూడెంలో ఘటన
అశ్వారావుపేట రూరల్, జూలై 18: భూవివాదం నేపధ్యంలో సొంత అన్ననే తమ్ముడు నరికి హత్య చేసిన సంఘటన అశ్వారావుపేట మండలం జమ్మిగూడెంలో ఆదివారం రాత్రి జరిగింది. అశ్వారావుపేట మండలంలోని జమ్మిగూడేనికి చెందిన దాది రాములు(55), దాది వెంకటేశ్వర్లు అన్నదమ్ములు. వారసత్వంగా వచ్చిన భూమిని సాగు చేసుకునే విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. కొన్నిసార్లు గ్రామపెద్దలు పంచాయితీలు నిర్వహించినట్లుగా సమాచారం. ఇదే తరుణంలో దాది రాములు తన సొంత పని నిమిత్తం తమ్ముడు నివాసం ఉండే ప్రాంతానికి వెళ్లాడు. తన అన్నయ్య అటుగా రావటం గమనించిన వెంకటేశ్వర్లు కత్తితో దాడి చేశాడు. విచరక్షణారహితంగా పలు చోట్ల నరికాడు. ఈ దాడిలో రాములు తీవ్రంగా గాయపడ్డాడు. దీనిని గమనించిన చుట్టు ప్రక్కల వారు కుటుంసభ్యులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన రాములును చికిత్స నిమిత్తం ఖమ్మం తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు జమ్మిగూడెం వెళ్లి విచారణ చేపట్టారు.