Komatireddy Raj Gopal Reddy: మునుగోడు అభివృద్ధి కోసం ఏ త్యాగానికైనా సిద్దం: రాజగోపాల్రెడ్డి
ABN , First Publish Date - 2022-07-30T22:27:40+05:30 IST
మునుగోడు (Munugodu) అభివృద్ధి కోసం ఏ త్యాగానికైనా సిద్దమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) ప్రకటించారు.
నల్లగొండ: మునుగోడు (Munugodu) అభివృద్ధి కోసం ఏ త్యాగానికైనా సిద్దమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉపఎన్నికల వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. తనపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా (Nalgonda District)కు ఏ నిధులు వచ్చినా పక్క జిల్లాలకు తీసుకుపోతున్నారని దుయ్యబట్టారు. ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టులను ఇంకా పూర్తి చేయలేదన్నారు. ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా మునుగోడు అభివృద్ధిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. మునుగోడు ప్రజలు పార్టీలకతీతంగా ఆలోచించాలని రాజగోపాల్రెడ్డి సూచించారు.
రాజగోపాల్రెడ్డి పార్టీ మార్పు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా... వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు ఎవరి కోణంలో వారు చూస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ (BJP TRS) దూకుడును ప్రదర్శిస్తుండగా కాంగ్రెస్ వేచిచూసే ధోరణిలో ఉంది. పార్టీ మార్పుపై స్పష్టతతో ఉన్నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా, పోటీపై రాజగోపాల్రెడ్డి డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాను ఎన్నటికీ మునుగోడును వదిలి వెళ్లనని ప్రకటించిన ఆయన..కార్యకర్తలను కాపాడుకునేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు.