By-Election మునుగోడులో దూకుడు పెంచిన టీఆర్ఎస్

ABN , First Publish Date - 2022-08-14T18:09:16+05:30 IST

నల్లగొండ (Nalgonda): అధికార టీఆర్ఎస్ (TRS) పార్టీ మునుగోడులో దూకుడు పెంచింది.

By-Election మునుగోడులో దూకుడు పెంచిన టీఆర్ఎస్

నల్లగొండ (Nalgonda): అధికార టీఆర్ఎస్ (TRS) పార్టీ మునుగోడులో దూకుడు పెంచింది. గ్రూపు తగాదాలకు చెక్ పెడుతూ రంగంలోకి అధిష్టానం పెద్దలు దిగారు. ఈనెల 20న సీఎం కేసీఆర్ (CM KCR) బహిరంగ సభను విజయవంతం చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేల చొప్పున ఇన్చార్జులను నియామించారు. కాగా ఇన్చార్జ్ ఎమ్మెల్యేలు అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. ఈ నెల 20న బహిరంగ సభ జరిగిన తర్వాతే మునుగోడు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.


మునుగోడు ఉప ఎన్నికను టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న కీలక ఎన్నిక అయినందున.. ఏమాత్రం తేలికగా తీసుకోవద్దని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు తాను కొంత దూరంగా ఉండడంతో పార్టీకి నష్టం జరిగిందన్న ఉద్దేశంతో ఉన్న కేసీఆర్‌.. మరోసారి దానిని పునరావృతం కానివ్వొద్దని పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం అసంతృప్తులను బుజ్జగించడం నుంచి ప్రచార పర్వం దాకా అన్నింట్లోనూ ఆయనే ముందుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా తొలుత పార్టీ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వంపై వస్తున్న అసంతృప్తిని చల్లార్చేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. అంతేకాకుండా నియోజకవర్గంలో భారీ బహిరంగ సభల్లో పాల్గొనాలని సీఎం నిర్ణయించారు. తొలి సభను ఈ నెల 20న ప్రజాదీవెన పేరుతో నిర్వహిస్తుండగా, మరో సభను పోలింగ్‌కు ముందు నిర్వహించనున్నారు. తొలి బహిరంగ సభకు ముందే అసంతృప్తులను బుజ్జగించాలనే ఉద్దేశంతో ఆశావహులను, అసంతృప్తిగా ఉన్న నేతలను ప్రగతిభవన్‌కు రావాలని పిలిచారు. ఈ మేరకు ఆశావహుల్లో ఒకరైన నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి శనివారం వచ్చి సీఎం కేసీఆర్‌ను కలిశారు.

Updated Date - 2022-08-14T18:09:16+05:30 IST