రాజంపేట, కోడూరులో వైసీపీకి ఓటమే

ABN , First Publish Date - 2022-01-27T07:59:35+05:30 IST

అన్నమయ్య జన్మించిన రాజంపేటను జిల్లా చేయకుండా రాయచోటిని ప్రకటించడంతో రాజంపేట, రైల్వేకోడూరులలో వైసీపీ ఓడిపోవడం ఖాయమని ఆ పార్టీ నేత, రాజంపేట

రాజంపేట, కోడూరులో వైసీపీకి ఓటమే

అన్నమయ్య జన్మించిన రాజంపేటను కాదని రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తారా?  

రాజంపేట మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రవి


రాజంపేట, జనవరి 26: అన్నమయ్య జన్మించిన రాజంపేటను జిల్లా చేయకుండా రాయచోటిని ప్రకటించడంతో రాజంపేట, రైల్వేకోడూరులలో వైసీపీ ఓడిపోవడం ఖాయమని ఆ పార్టీ నేత, రాజంపేట మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మర్రి రవి అన్నారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు వైసీపీ నేతలను తిరగనివ్వరని, ప్రజల మనోభావాలను, నాయకుల అభిప్రాయాలను తెలుసుకోకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించినందుకు అవసరమైతే మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. జిల్లాల ప్రకటన వెలువడిన తర్వాత ఆయన కన్నీటిపర్యంతమవుతూ మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘‘అందరికీ నమస్కారం. మా లాంటి వాళ్లు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలవాలంటే వీలుపడదు. అపాయింట్‌మెంట్‌ ఇప్పించే నాఽథుడు ఉండడు. నా వీడియో సీఎం జగన్‌కు చేరే వరకు అందరూ సోషల్‌ మీడియాలో నా వ్యాఖ్యలు పోస్ట్‌ చేయండి. మేమేదో మంచి చేస్తామని రాజంపేట ప్రజలు మున్సిపల్‌ ఎన్నికల్లో మాకు ఓట్లేసి గెలిపించారు. మేము కూడా నిజాయితీగానే చేయాలనుకున్నాం. అన్నమయ్య పుట్టిన గడ్డను జిల్లా కేంద్రం చేయకుండా ఎక్కడో ఉన్న రాయచోటిని ఆయన పేరిట జిల్లా చేశారు.


మమ్మల్ని అవమానించేలా అన్నమయ్య పేరుతో రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం చాలా దారుణం. మీకు కావాలనుకుంటే రాయచోటిని మదనపల్లెలో కలుపుకొని మరో జిల్లా చేసుకోండి. పూర్వం నుంచి మాకు కడప బిడ్డలమనే పేరుంది. కడపలో పడేసినా మర్యాద ఉంటుంది. మమ్మల్ని తీసుకెళ్లి అనాథబిడ్డల్లా రాయచోటిలో కలపడమేంది? ఎవరిని అడిగి చేశారయ్యా? మీరే నిర్ణయించుకుని, ఏం బాధ్యత లేకుండా ఎలా చేస్తారు? రాజంపేటలో నాయకులు లేరనుకున్నారా? రాజంపేట ప్రజలు పట్టించుకోరనుకున్నారా? కచ్చితంగా కోడూరు, రాజంపేట సీట్లను వైసీపీ పొగొట్టుకోవాల్సి వస్తుంది. ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారు. మాకు పదవులు ముఖ్యం కాదు. పది మందితో మంచిగా ఉండటమే ముఖ్యం. అవసరమైతే నాకు ఇటీవల ఇచ్చిన మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తా. ఏ సలహాదారులు ఇలాంటి సలహాలిస్తున్నారో? దయచేసి ముఖ్యమంత్రి ఆలోచించాలి. చాలా బాధగా ఉంది. రాజంపేటను కడపలో ఉంచండి. లేదంటే రాజంపేటను జిల్లా కేంద్రం చేయండి. కాదంటే నేను ఆమరణ దీక్షకు సిద్ధమవుతా’’ అంటూ మర్రి రవి సోషల్‌ మీడియాలో వీడియో పోస్టు చేశారు. 


Updated Date - 2022-01-27T07:59:35+05:30 IST