ఏసీబీ వలలో మున్సిపల్‌ ఆర్‌ఐ

ABN , First Publish Date - 2021-04-11T07:06:28+05:30 IST

ఏసీబీ అధికారులకు ఓ మున్సిపల్‌ ఆర్‌ఐ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

ఏసీబీ వలలో మున్సిపల్‌ ఆర్‌ఐ
ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఎస్‌.ఎం.రఫి

రూ.9వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు


తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్‌ 10: ఏసీబీ అధికారులకు ఓ మున్సిపల్‌ ఆర్‌ఐ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తిరుపతి అర్బన్‌ ఏసీబీ డీఎస్పీ జనార్దననాయుడు తెలిపిన వివరాల మేరకు.. తిరుపతికి చెందిన నరసింహారెడ్డి శ్రీపురం కాలనీలోని సాయిప్రణీత్‌రెడ్డి అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ నెంబరు 102ను 2014లో డాక్టర్‌ హరినాథ్‌రెడ్డి నుంచి కొనుగోలు చేశాడు. అప్పటినుంచి అందులోనే కాపురం ఉంటున్నాడు. అయితే మున్సిపల్‌ రికార్డుల్లో డాక్టర్‌ హరినాథ్‌రెడ్డి పేరుతోనే ఫ్లాట్‌ ఉండటంతో దాన్ని మార్చుకోవడానికి నరసింహారెడ్డి ప్రయత్నం చేశాడు. ఇందుకోసం మున్సిపల్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) ఎస్‌.ఎం.రఫిని గతనెల 23వ తేదీన కలిశారు. రికార్డులను పరిశీలించిన ఆర్‌ఐ పేరు మార్పునకు అవసరమైన పత్రాలను తీసుకున్నాడు. ఆన్‌లైన్‌లో చేయాల్సి ఉంటుందని, అందుకు రూ.10 వేల ఖర్చవుతుందని చెప్పాడు. తన వద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో తర్వాత కలవమని చెప్పి పంపించేశాడు. శుక్రవారం తిరిగి ఆర్‌ఐని బాధితుడు కలిశాడు. దాంతో ఆన్‌లైన్‌లో చలానా అమౌంట్‌ రూ.9,600లను నరసింహారెడ్డి ద్వారా చెల్లించాడు. పని పూర్తవ్వాలంటే తాను ముందుగా చెప్పినట్లు రూ.10వేలను లంచంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అంత డబ్బు ఇవ్వలేనని చెప్పగా, ఓ వెయ్యి తగ్గించి రూ.9వేలను మాత్రం ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పాడు. దీనిపై బాధితుడు తిరుపతి ఏసీబీని ఆశ్రయించాడు. ఆ తర్వాత ఏసీబీ అధికారులతో కలిసి శనివారం మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ రఫి కనిపించలేదు. అధికారుల సూచనలతో ఆర్‌ఐకి ఫోన్‌ చేయగా.. తాను నగరంలోని శ్రీదేవి కాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న ఓ వస్త్రాల దుకాణంలో ఉన్నానని చెప్పడంతో అందరూ అక్కడికెళ్లారు. ఆర్‌ఐకి రూ.9వేలను బాధితుడు ఇవ్వగా, అతను డబ్బును జేబులో పెట్టుకున్న వెంటనే ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో రఫి సీటుకు సంబంధించిన రికార్డులను తనిఖీచేశారు. లంచం తీసుకున్నందుకే ప్రస్తుతానికి రఫిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ చెప్పారు. అలాగే ఆయన ఆస్తుల వివరాలను కూడా పరిశీలిస్తామని, లభించిన ఆధారాల మేరకు చర్యలు ఉంటాయని వెల్లడించారు. ప్రభుత్వ శాఖాధికారులు, సిబ్బంది ఎవరైనా ప్రజలను లంచం డిమాండ్‌ చేస్తే ఏసీబీకి సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-04-11T07:06:28+05:30 IST