పనికిమాలిన సవాళ్లకు మేమెందుకు స్పందించాలి?: బొత్స

ABN , First Publish Date - 2020-08-07T09:19:33+05:30 IST

పరిపాలన వికేంద్రీకరణపై డెడ్‌లైన్లు, సవాళ్లు విసురుతున్న చంద్రబాబు.. రాష్ట్ర విభజన సమయంలో ఎందుకు డెడ్‌లైన్లు పెట్టలేదని పురపాలక మంత్రి బొత్స

పనికిమాలిన సవాళ్లకు మేమెందుకు స్పందించాలి?: బొత్స

విశాఖపట్నం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): పరిపాలన వికేంద్రీకరణపై డెడ్‌లైన్లు, సవాళ్లు విసురుతున్న చంద్రబాబు.. రాష్ట్ర విభజన సమయంలో ఎందుకు డెడ్‌లైన్లు పెట్టలేదని పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆయన పనికిమాలిన సవాళ్లు చేస్తే.. తామెందుకు స్పందించాలని అన్నారు. రాజధాని అంశంపై చంద్రబాబుకు తనపై తనకు నమ్మకముంటే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించాలని ప్రతిసవాల్‌ విసిరారు. ‘రాష్ట్ర ప్రయోజనాలు కంటే... రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాలు ముఖ్యమని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. అలాంటి వ్యక్తిని ఉత్తరాంధ్ర, సీమల్లోనే కాదు.. చివరకు కృష్ణా జిల్లాలోనైనా అడుగుపెట్టనివ్వొచ్చా?’ అని ప్రశ్నించారు. మూడు రాజధానుల పనులు ప్రారంభిద్దామనుకుంటే చంద్రబాబు కోర్టులో కేసులు వేసి అడుకున్నారని ఆరోపించారు. ఈ అంశంపై కేసులు ఉన్నందున.. భూమిపూజ ఎప్పుడు చేస్తామో చెప్పలేకపోతున్నామన్నారు. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రప్రభుత్వ పరిధిలోనిదేనని కేంద్ర హోం శాఖ హైకోర్టుకు చెప్పిందని దీంతోనైనా చంద్రబాబు కళ్లు తెరవాలని బొత్స అన్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరిక విషయమై ప్రశ్నించగా.. ‘ఆయన టీడీపీని ఎప్పుడు వద్దనుకుంటారో... మా పార్టీలో ఎప్పుడు చేరాలనుకుంటారో..’ అంటూ ప్రశ్నార్థకంగా సమాఽధానమిచ్చారు. గడిచిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు టీడీపీని తిరస్కరించి గట్టి గుణపాఠం చెప్పినా చంద్రబాబు బుద్ధి మారలేదని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ఓ ప్రకటనలో విమర్శించారు. ‘మీకు చేతనైతే మీరు, మీ టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి మీ నిబద్ధత ఏమిటో నిరూపించుకోవాలి’ అని సవాల్‌ విసిరారు.

Updated Date - 2020-08-07T09:19:33+05:30 IST