‘పుర’ పోరుకు ముగిసిన ప్రచారం
ABN , First Publish Date - 2022-02-18T14:35:22+05:30 IST
రాష్ట్రంలో నగర, పురపాలక, పట్టణ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి గురువారం సాయంత్రం ప్రచారం ముగిసింది. రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్రులు చివరి ప్రయత్నంగా గురువారం
- మూగబోయిన మైకులు
- 6 గంటలకు హడావుడిగా ప్రచారం ముగించిన నేతలు
అడయార్(చెన్నై): రాష్ట్రంలో నగర, పురపాలక, పట్టణ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి గురువారం సాయంత్రం ప్రచారం ముగిసింది. రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్రులు చివరి ప్రయత్నంగా గురువారం వీధివీధినా, ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. రాష్ట్రంలో చెన్నై కార్పొరేషన్తో సహా మొత్తం 21 నగరపాలక సంస్థలు, 138 మున్సిపాలిటీలు, 489 పట్టణ పంచాయతీలకు ఈ నెల 19వ తేదీన ఒకే దశలో పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మూడు నగర పాలక సంస్థల్లో మొత్తం 12,826 వార్డులు ఉండగా, ఇందులో 218 మంది వార్డు కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 12,607 వార్డు కౌన్సిలర్ పదవులకు 57,778 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసింది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 7వ తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ప్రచారం 8వ తేదీ నుంచి ముమ్మరంగా సాగింది. బరిలో నిలిచిన అభ్యర్థులు విజయం కోసం ప్రతి వీధికి వెళ్ళి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. తమతమ అభ్యర్థుల విజయం కోసం ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రచారం చేశారు. డీఎంకే అభ్యర్థుల విజయానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వర్చువల్ విధానంలో ప్రచారం చేయగా, మంత్రులు, పార్టీ కీలక నేతలు మాత్రం జిల్లాల్లో పర్యటిస్తూ ప్రచారం చేశారు. అన్నాడీఎంకే తరపున ఆ పార్టీ కన్వీనర్ ఒ.పన్నీర్సెల్వం, ఉప సమన్వయకర్త ఎడప్పాడి కె.పళనిస్వామితో పాటు పార్టీ ముఖ్యనేతలు ప్రచారం చేశారు. అదేవిధంగా మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్, నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్, అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్, డీఎండీకే కోశాధికారి ప్రేమలత, టీఎన్సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, ఇతర పార్టీలకు చెందిన నేతలు ప్రచారం చేపట్టారు. గురువారం సాయంత్రం 6 గంటలకు నేతలంతా ప్రచారం నిలిపేశారు.