ముంబైని మళ్లీ కమ్మేస్తున్న కరోనా.. కేసుల్లో భారీ పెరుగుదల
ABN , First Publish Date - 2021-12-24T02:39:43+05:30 IST
కరోనా తొలి, రెండో దశలో ముంబైని చుట్టేసిన కరోనా వైరస్ మళ్లీ జడలు విప్పుతోంది. కేసులు అత్యంత కనిష్టానికి..
ముంబై: కరోనా తొలి, రెండో దశలో ముంబైని చుట్టేసిన కరోనా వైరస్ మళ్లీ జడలు విప్పుతోంది. కేసులు అత్యంత కనిష్టానికి చేరుకుంటున్నాయని భావిస్తున్న వేళ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించడం ఆందోళనకు గురిచేస్తోంది. నేడు (గురువారం) కొత్తగా 602 కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. ఈ ఏడాది అక్టోబరు 6వ తేదీ తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
తాజా కేసులతో కలుపుకుని ఇప్పటి ముంబైలో నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 7,68,750కు పెరగ్గా, మరణాల సంఖ్య 16,367కి పెరిగినట్టు బృహన్ ముంబై కార్పొరేషన్ తెలిపింది. అలాగే, నేడు 207 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 7,46,991 చేరుకుది. ఇంకా, 2,813 కేసులు క్రియాశీలంగా ఉన్నట్టు బీఎంసీ తెలిపింది.