సుశాంత్ మృతి కేసులో ముంబై పోలీసులు కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2020-08-05T02:36:02+05:30 IST
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసుపై ముమ్మర దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు...
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసుపై ముమ్మర దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సుశాంత్ బ్యాంకు ఖాతా లావాదేవీల లెక్కతేల్చేందుకు ఓ ఫోరెన్సిక్ ఆడిటర్ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. సుశాంత్ బ్యాంకు ఖాతాలన్నిటినీ ఫోరెన్సిక్ ఆడిటర్ పరిశీలిస్తారని పోలీసులు తెలిపారు. గత నెల 28న సుశాంత్ గర్ల్ఫ్రెండ్, నటి రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్కు అనుగుణంగా ఈడీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ముంబై పోలీసులు సుశాంత్ లావాదేవీలపై ఆడిట్ చేపట్టడం గమనార్హం. సుశాంత్ ఖాతా నుంచి గత ఏడాది కాలంలో రూ.15 కోట్ల మేర గుర్తు తెలియని వారికి బదిలీ అయ్యాయంటూ అతడి తండ్రి కేకే సింగ్ ఆరోపించారు. దీనిపై ఈడీ అధికారులు ఇటీవల సుశాంత్ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలపై చార్టర్డ్ అకౌంటెంట్ సందీప్ శ్రీధర్ను విచారించారు. మరోవైపు సుశాంత్ తండ్రి అభ్యర్థన మేరకు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ కేంద్రానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.