వర్షాలతో మత్స్యకారులు సతమతం... ప్రభుత్వం సహాయం చేయాలని డిమాండ్...

ABN , First Publish Date - 2020-07-05T22:09:30+05:30 IST

మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి

వర్షాలతో మత్స్యకారులు సతమతం... ప్రభుత్వం సహాయం చేయాలని డిమాండ్...

ముంబై : మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ట్రాఫిక్ జామ్‌లు, లోతట్టు ప్రాంతాలు జలమయమవడం వంటివాటివల్ల ప్రజల విలువైన సమయం వృథా అవుతోంది. మరోవైపు మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో ముంబైలోని కోలీ మత్స్యకారులు నానా అవస్థలు పడుతున్నారు. అంతంత మాత్రంగా వచ్చే ఆదాయంతో జీవించేవారు ఓవైపు అష్ట దిగ్బంధనం, మరో వైపు వర్షాలతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. 


ముంబైలోని కొలాబా కోలీవాడకు చెందిన మత్స్యకారుడు జయేష్ భోయిర్ మాట్లాడుతూ, తన ఆర్థిక పరిస్థితులు ఈ వర్షాల వల్ల మరింత దెబ్బతిన్నట్లు తెలిపారు. తనకు చాలా స్వల్ప ఆదాయం వస్తుందని, అష్ట దిగ్బంధనంతోపాటు మూడు రోజుల నుంచి వర్షాలు పడుతుండటం వల్ల తన ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని చెప్పారు. 


కోవిడ్-19 మహమ్మారి నిరోధానికి ప్రభుత్వం అమలు చేస్తున్న మార్గదర్శకాల వల్ల తమకు రెండు నెలల నుంచి ఆదాయం లేదని చెప్పారు. తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. పుండు మీద కారం జల్లినట్లుగా అష్ట దిగ్బంధనానికి తోడుగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. దీంతో తాము దయనీయ స్థితిలో జీవిస్తున్నామన్నారు. ఇటువంటి ప్రకృతి విపత్తులు సంభవించినపుడు ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని కోరారు. 


వర్షాకాలానికి ముందు బృహన్ముంబై నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతూ ఉండేదని, ఈ సంవత్సరం ఇప్పటికీ ప్రారంభం కాలేదని చెప్పారు. 


మత్స్యకార నేతలు మాట్లాడుతూ, తాము పల్లపు ప్రాంతాల్లో జీవిస్తున్నామని, భద్రత పట్ల తమకు ఆందోళనగా ఉందని, అధికారులు తమకు సహాయపడాలని కోరారు. 


ముంబై పోలీసులు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో, స్థానికులు సముద్రం వైపు వెళ్ళవద్దని, సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని కోరారు. వర్షాల వల్ల రోడ్లు జలమయమవుతున్నాయని, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.


Updated Date - 2020-07-05T22:09:30+05:30 IST