ముంబై బౌలర్ల దెబ్బకు చెన్నై విలవిల.. ప్రత్యర్థి ఎదుట స్వల్ప విజయ లక్ష్యం

ABN , First Publish Date - 2020-10-24T03:06:05+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 పరుగులు మాత్రమే చేసింది. టాస్ ఓడి

ముంబై బౌలర్ల దెబ్బకు చెన్నై విలవిల.. ప్రత్యర్థి ఎదుట స్వల్ప విజయ లక్ష్యం

షార్జా: ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 పరుగులు మాత్రమే చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఓవర్ ఐదో బంతికి రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ అయ్యాడు. ఇక ఆ తర్వాతి నుంచి చెన్నై వికెట్ల పతనం ప్రారంభమైంది. బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చినట్టే వచ్చి పెవిలియన్‌కు క్యూకట్టారు. ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, రాహుల్ చాహర్ బౌలింగ్ దాడికి ఎదురొడ్డి నిలబడలేక చేతులెత్తేశారు.


దీంతో మూడు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.  అంబటి రాయుడు (2), జగదీశన్ (0), డుప్లెసిస్ (1) వికెట్లను వరుసపెట్టి కోల్పోంది. 2.5 ఓవర్లలో మూడు పరుగులకే నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ (16), జడేజా (7)లు కూడా కుదరుకోలేకపోయారు. దీంతో చెన్నై ఇన్నింగ్స్ 50 పరుగుల్లోపే ముగుస్తుందని అందరూ భావించారు.


అయితే, శామ్ కరన్ ఒంటరి పోరాటంతో చెన్నై 114 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. 47 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో కరన్ 52 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి బౌల్డయ్యాడు. దీపక్ చాహర్ డకౌట్ కాగా, శార్దూల్ ఠాకూర్ 11, ఇమ్రాన్ తాహిర్ 13 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ నాలుగు వికెట్లు తీసుకోగా, బుమ్రా, చాహర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. కౌల్టర్ నైల్‌కు ఓ వికెట్ దక్కింది.

Updated Date - 2020-10-24T03:06:05+05:30 IST