తండ్రి మృతితో తల్లడిల్లిపోతున్న పిల్లలు... ఇంటికి వెళ్లేమార్గం లేక...
ABN , First Publish Date - 2020-06-02T16:59:02+05:30 IST
లాక్డౌన్ కాలంలో తండ్రి మృతి చెందాడు. ఈ బాధతో తల్లడిల్లిపోతున్న అతని పిల్లలు ఇప్పుడు తమ ప్రాంతానికి కూడా వెళ్లలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన 21 ఏళ్ల అభిషేక్...
ముంబై: లాక్డౌన్ కాలంలో తండ్రి మృతి చెందాడు. ఈ బాధతో తల్లడిల్లిపోతున్న అతని పిల్లలు ఇప్పుడు తమ ప్రాంతానికి కూడా వెళ్లలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన 21 ఏళ్ల అభిషేక్ తన సోదరితో పాటు స్వస్థలానికి వెళ్లాలనుకుంటున్నాడు. అయితే వారి దగ్గర ఇప్పుడు పైసా కూడా లేదు. ఇరుగుపొరుగువారు వీరికి ఆహారం అందిస్తున్నారు. ఈ సందర్భంగా ముంబైలోని దహిసర్లో ఉంటున్న అభిషేక్ మాట్లాడుతూ మే 23న తన తండ్రికి జ్వరం వచ్చిందని, వెంటనే తాము అతనిని సమీపంలోని వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళామన్నారు. డాక్టర్ ఇచ్చిన మందులు వాడినా ఫలితం లేకపోయిందన్నాడు. తరువాత మరిన్ని ఆసుపత్రులకు తీసుకువెళ్లామన్నాడు. ఈ నేపధ్యంలోనే అభిషేక్ తండ్రి మృతి చెందాడు. అయితే వైద్యులు అభిషేక్ తండ్రి కరోనా అనుమానాస్పద రోగి అని తేల్చిచెప్పారు. ప్రస్తుతం అభిషేక్ తన 12 ఏళ్ల సోదరితో కలిసి దాహిసర్లో ఉంటున్నాడు. అతని తండ్రి చీరలపై డిజైనింగ్ పని చేసేవాడు. తండ్రి ఆకస్మిక మరణం తరువాత పిల్లలు పలు అవస్థలు పడుతున్నారు. అభిషేక్ తల్లి బెంగాల్లో ఉంటోంది. దీంతో పిల్లలిద్దరూ బెంగాల్ వెళ్లాలని కోరుకుంటున్నారు. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా వారు బెంగాల్ వెళ్లలేకపోతున్నారు.పైగా వారు రెండు నెలల ఇంటి అద్దె కూడా చెల్లించాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వారు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు.