పంజాగుట్ట పోలీస్స్టేషన్కు సినీనటి ముమైత్ఖాన్
ABN , First Publish Date - 2020-10-02T01:11:31+05:30 IST
నటి ముమైత్ఖాన్, క్యాబ్ డ్రైవర్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు.
హైదరాబాద్: నటి ముమైత్ఖాన్, క్యాబ్ డ్రైవర్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు. గురువారం ముమైత్ఖాన్ పంజాగుట్ట పోలీస్స్టేషన్ మెట్లెక్కింది. తనపై ఆరోపణలు చేసిన క్యాబ్ డ్రైవర్పై ముమైత్ఖాన్ ఫిర్యాదు చేసింది. ఈ వివాదంపై ముమైత్ స్పందించలేదు. దీంతో ఆమె తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ముమైత్ఖాన్ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
అనంతరం ముమైత్ఖాన్ మీడియాతో మాట్లాడారు. ‘‘రెండు రోజుల నుంచి నాపై జరుగుతున్న తప్పుడు ఆరోపణలపై ఫిర్యాదు ఇచ్చాను. నాకు క్యాబ్ డ్రైవర్ ను చీట్ చేయాల్సిన అవసరం ఏంటి.. కొన్ని మీడియా ఛానళ్లు నా పరువుకి భంగం కలిగేలా వార్తలు ప్రసారం చేశాయి. నా క్యారెక్టర్ను జడ్జ్ చేసే అధికారం ఏముంది. ఒక్కసారి ఆలోచించండి. నామీద డ్రైవర్ తప్పుడు ఆరోపణలు చేశాడు. అతను చెప్పిన దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. అతను రాష్ డ్రైవింగ్ చేసి నన్ను భయాందోళనకు గురి చేశాడు. అతనిపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ పోలీసులకు అందజేశాను. అతనికి 23 వేలు 500 డబ్బులు చెల్లించాను. మీడియా ఒక్క సైడ్ వర్షన్ తీసుకొని వార్తలు వేయడం నన్ను బాధించింది. నేను 12 సంవత్సరాల నుండి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాను. నా క్యారెక్టర్ అందరికీ తెలుసు. టోల్గేట్లకు సంబంధించి పూర్తి డబ్బులు నేనే కట్టాను’’ అని ముమైత్ఖాన్ తెలిపారు.
ముమైత్ఖాన్ గురించి డ్రైవర్ రాజు సంచలన విషయాలు బయటపెట్టిన విషయం తెలిసిందే. ముమైత్ఖాన్ రూ.30 వేలకు గోవా ట్రిప్ మాట్లాడుకుందని, మూడు రోజుల కోసం గోవా ట్రిప్కు కారు తీసుకెళ్లిందని తెలిపాడు. అయితే 5 రోజుల పాటు గోవాలో తిప్పిందని వాపోయాడు. డీజిల్ ఖర్చుకు డబ్బులు అడిగితే ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని, కారులో మద్యం, సిగరెట్లు తాగుతూ అసభ్యంగా ప్రవర్తించిందని వాపోయాడు. టోల్ గేట్కు, డ్రైవర్ అకామిడేషన్కు డబ్బులు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా టోల్గేట్ దగ్గర కట్టిన డబ్బులు తాలూకు రిసిప్ట్స్, ముమైత్తో కలిసిన దిగిన ఫొటోలు, ఆమెతో చేసిన వాట్సాప్ చాట్ను రాజు షేర్ చేశాడు.