అఖిలేశ్కు నఖ్వీ సూటి ప్రశ్న
ABN , First Publish Date - 2022-01-29T18:03:33+05:30 IST
ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల సమయంలో సమాజ్వాదీ
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల సమయంలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ జోకులేస్తున్నారా? అని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రశ్నించారు. సైకిల్కు పంక్చర్ అయినా బీజేపీపైనే ఆరోపణలు చేస్తారన్నారు. యాదవ్ శుక్రవారం ట్విటర్ వేదికగా బీజేపీపై చేసిన ఆరోపణలపై నఖ్వీ శనివారం ఘాటుగా స్పందించారు.
అఖిలేశ్ యాదవ్ శుక్రవారం ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్ నగర్లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్ళేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్ళారు. ఆయన ప్రయాణించవలసిన హెలికాప్టర్కు విమానాశ్రయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అనుమతి ఇవ్వలేదు. ఆయన కాసేపు వేచి చూడవలసి వచ్చింది. దీంతో ఆయన బీజేపీపై ట్విటర్ వేదికగా ఆరోపణలు చేశారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రయాణించేందుకు తన హెలికాప్టర్కు అనుమతి ఇవ్వలేదన్నారు. అనుమతి ఇవ్వకపోవడానికిగల కారణాలేమిటో తెలియజేయలేదన్నారు. తన హెలికాప్టర్ బయల్దేరడానికి ముందు ఓ బీజేపీ నేత ప్రయాణించే హెలికాప్టర్కు అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు. బీజేపీ నైరాశ్యంలో ఉందని, తన హెలికాప్టర్ను ఆపడం కుట్ర అని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటం వారి ఓటమికి సంకేతమని పేర్కొన్నారు. సోషలిస్టు పోరాటంలో ఈ రోజును కూడా రికార్డు చేసి ఉంచుతామన్నారు. తాము చరిత్ర సృష్టిస్తామన్నారు. ముజఫర్ నగర్ చేరుకున్న తర్వాత యాదవ్ మరో ట్వీట్ చేశారు. ఎస్పీ-ఆర్ఎల్డీ కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అన్నదాతలపై బీజేపీ ప్రభుత్వం దురాగతాలకు పాల్పడిందని ఆరోపించారు.
అఖిలేశ్ ఆరోపణలపై ఢిల్లీ విమానాశ్రయ అధికారి ఒకరు స్పందించారు. ఎయిర్ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉన్నందువల్ల అఖిలేశ్ ప్రయాణించవలసిన హెలికాప్టర్కు ఏటీసీ అనుమతి ఇవ్వలేదని ఆ అధికారి చెప్పినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది. ఈ హెలికాప్టర్ ప్రయాణించేందుకు ఏటీసీ అనుమతి ఇచ్చిందని, అయితే ఆ హెలికాప్టర్లో తగినంత ఇంధనం లేదని, ఇంధనాన్ని నింపిన తర్వాత ప్రయాణానికి అనుమతించినట్లు, అది తన గమ్యస్థానాన్ని చేరినట్లు తెలిపారని పేర్కొంది.
ఈ నేపథ్యంలో నఖ్వీ శనివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల సమయంలో అఖిలేశ్ యాదవ్ జోకులేస్తున్నారా? అని ప్రశ్నించారు. ‘‘నా సైకిల్కు పంక్చర్ అయింది, బీజేపీయే పంక్చర్ చేసింది అని కూడా మీరు అంటారు’’ అన్నారు. సమాజ్వాదీ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ అనే సంగతి తెలిసిందే.
ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో అఖిలేశ్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఓడిపోబోతున్నామనే నైరాశ్య భావన అఖిలేశ్కు ఉందన్నారు. సమాజ్వాదీ పార్టీ అంటే నేరగాళ్ళు, గ్యాంగ్స్టర్ల పార్టీ అని మండిపడ్డారు. ఇటువంటి నేరగాళ్ళ మద్దతుతో ప్రజా సంక్షేమానికి పాటుపడతామని ఆ పార్టీ హామీలిస్తోందని దుయ్యబట్టారు.