ముక్కంటి బ్రహ్మోత్సవాలకు ఘనంగా అంకురార్పణ
ABN , First Publish Date - 2021-03-07T07:17:56+05:30 IST
శ్రీకాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాలు శనివారం భక్తకన్నప్ప ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి
శ్రీకాళహస్తి, మార్చి 6: శ్రీకాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాలకు శనివారం భక్తకన్నప్ప ధ్వజారోహణంతో వైభవంగా అంకురార్పణ జరిగింది. ముందుగా ముక్కంటి ఆలయంలో భక్తకన్నప్ప ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు జరిపి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మేళతాళాల నడుమ పట్టణ సమీపంలోని భక్తకన్నప్ప కొండపై ఉన్న ఆలయానికి తీసుకెళ్లారు.ధ్వజస్తంభంపై కొడిని ఎగురవేసి శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు.అనంతరం ఉత్సవమూర్తిని శ్రీకాళహస్తి పురవీధుల్లో రాత్రి ఊరేగించగా భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.ఆలయ ఈవో పెద్దిరాజు, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణారెడ్డి, ఏఈవో ధనపాల్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో బాగంగా ఆదివారం ముక్కంటీశుడి ధ్వజారోహణం నిర్వహించనున్నారు.స్వామి గర్భాలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభంపై వృషభ పతాకం ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు అష్టదిక్పాలకులను, సకల దేవతాగణాలను ఆహ్వానిస్తారు.