ముఖలింగేశ్వరుని కల్యాణోత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-06-21T04:41:33+05:30 IST
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీముఖలింగేశ్వరస్వామి పంచరాత్రి కల్యాణ మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఆదివారం అర్చకులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం ఆలయ ధర్మకర్త, పర్లాకిమిడి మహారాజు పేరున ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. రాత్రి 7 గంటలకు గ్రామ పురోహితులు బంకుపల్లి భూషణ శర్మ ఆధ్వర్యంలో ప్రధాన ఆలయం మధుకేశ్వరస్వామి ఆలయానికి ఎదురుగా ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు.
ఘనంగా ధ్వజారోహణం
శ్రీముఖలింగం (జలుమూరు) జూన్ 20: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీముఖలింగేశ్వరస్వామి పంచరాత్రి కల్యాణ మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఆదివారం అర్చకులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం ఆలయ ధర్మకర్త, పర్లాకిమిడి మహారాజు పేరున ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. రాత్రి 7 గంటలకు గ్రామ పురోహితులు బంకుపల్లి భూషణ శర్మ ఆధ్వర్యంలో ప్రధాన ఆలయం మధుకేశ్వరస్వామి ఆలయానికి ఎదురుగా ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన, మండపారాధన, దీక్ష కంకణారాధన, బలిహరణ, మంత్రపుష్పం తదితర ప్రక్రియలు చేపట్టారు. స్వామివారి కల్యాణానికి అష్టదిక్పాలకులకు ధ్వజారోహణతో ఆహ్వానం పలకడం సంప్రదాయం. సోమవారం రాత్రి పార్వతీ పరమేశ్వరుల కల్యాణం నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. కరోనా నేపథ్యంలో కల్యాణోత్సవాలకు భక్తులకు ప్రవేశం లేదని ఆలయ ఈవో ఎన్వీ రమణయ్య తెలిపారు. కార్యక్రమంలో అర్చకుల సంఘం అధ్యక్షుడు పెద్దలింగన్న, పలువురు అర్చకులు, దేవదాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.