2జీకి స్వస్తి చెప్పాలి
ABN , First Publish Date - 2020-08-01T08:16:26+05:30 IST
సుమారు 25 సంవత్సరాల క్రితం నాటి 2జీ టెక్నాలజీకి కాలం చెల్లిపోయిందని
ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ : సుమారు 25 సంవత్సరాల క్రితం నాటి 2జీ టెక్నాలజీకి కాలం చెల్లిపోయిందని, దాన్ని క్రమంగా వదిలించుకునేందుకు విధానపరమైన చర్యలు అవసరమని ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ అన్నారు. ఒకపక్క భారత్ సహా ప్రపం చం యావత్తు 5జీ టెక్నాలజీలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్న తరుణంలో 2జీ ఫీచర్ ఫోన్ల వల్ల దేశంలో 30 కోట్ల మంది మౌలిక ఇంటర్నెట్ సదుపాయం అందుకోలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
1995లో మొబైల్ సర్వీసులు ప్రవేశపెట్టడంతో భారతదేశం ఉజ్వల భవిష్యత్తు కోసం పోరాటంలోకి అడుగు పెట్టిందని ఆయన అన్నారు. అప్పటి నుంచి మొబైల్ కాల్ చార్జీలు కూడా గణనీయంగా తగ్గి ఇప్పుడు వినియోగదారులు ఎలాంటి కాలపరిమితి లేకుండా ఉచితంగా కాల్ మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందని ఆయన చెప్పారు. ఇప్పుడు ప్రజలు తమ ఫోన్ ద్వారానే మేధస్సును పంచుకుంటున్నారని, వార్తలు, వీడియోలు చూస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలను సాధికారం చేయడంలో మొబైల్ ఫోన్ ఎంత సమర్థవంతమైన సాధనం అన్నది కొవిడ్ సంక్షోభం నిరూపించిందని అంబానీ పేర్కొన్నారు.