రిలయన్స్ రిటైల్లో ముబదాలకు వాటా
ABN , First Publish Date - 2020-10-02T07:21:30+05:30 IST
అబుదాబీకి చెందిన సావరిన్ వెల్త్ ఫండ్ ముబదాల.. తాజాగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్)లో రూ.6,247.5 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా 1.4 శాతం వాటాను చేజిక్కించుకుంది...
- రూ.6,247 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ : రిలయన్స్ రిటైల్ కంపెనీలోకి పెట్టుబడుల వరద కొనసాగుతోంది. అబుదాబీకి చెందిన సావరిన్ వెల్త్ ఫండ్ ముబదాల.. తాజాగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్)లో రూ.6,247.5 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా 1.4 శాతం వాటాను చేజిక్కించుకుంది. రిలయన్స్ రిటైల్లో పెట్టుబడులు పెట్టిన నాలుగో సంస్థ ఇది. గత నెల రోజుల్లోనే ముకేశ్ అంబానీ నాయకత్వంలోని ఈ రిటైల్ చెయిన్లో నాలుగు పీఈ సంస్థలు రూ.24,847.5 కోట్లతో 5.65 శాతం వాటా కొనుగోలు చేశాయి. ఇటీవల ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపారాన్ని కూడా రిలయన్స్ గ్రూప్ దాదాపు రూ.25,000 కోట్లతో కొనుగోలు చేసింది. దీంతో పలు అంతర్జాతీయ పీఈ, సావరిన్ వెల్త్ ఫండ్స్ రిలయన్స్ రిటైల్ ఈక్విటీలో వాటా కోసం ఆసక్తి చూపిస్తున్నాయి. త్వరలోనే మరిన్ని పీఈ సంస్థలు రిలయన్స్ రిటైల్లో మరిన్ని పెట్టుబడులు పెడతాయని భావిస్తున్నారు.