సచిన్, ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసేవారున్నారు.. కానీ ధోనీ అలా కాదు: కైఫ్
ABN , First Publish Date - 2020-05-21T23:22:32+05:30 IST
ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2019 తర్వాత ఎంఎస్ ధోనీ క్రికెట్కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దాదాపు 9 నెలలు గడిచినా.. మహీ
ముంబై: ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2019 తర్వాత ఎంఎస్ ధోనీ క్రికెట్కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దాదాపు 9 నెలలు గడిచినా.. మహీ మైదానంలోకి దిగలేదు. తొలుత రెండు నెలల పాటు ధోనీ సెలవులో ఉంటాడని ప్రకటించినా.. ఆ తర్వాత కూడా అతను జట్టులో చేరలేదు. ఇక సెలక్షన్కు కూడా అందుబాటులో లేకపోవడంతో.. అతని బోర్డు కాంట్రాక్ట్ను బీసీసీఐ రద్దు చేసింది. దీంతో రిటైర్మెంట్పై ఒత్తిడి నెలకొన్నా.. మహీ ఎలాంటి విషయం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ధోనీ విషయంలో తొందరపాటులో నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని.. టీం ఇండియా ఆటగాడు మహ్మద్ కైఫ్ అన్నారు.
ఈ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైఫ్ మాట్లాడుతూ.. ధోనీ స్థానాన్ని భర్తీ చేసేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. ‘‘అతని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేదు. కేఎల్ రాహుల్ సుదీర్ఘంగా వికెట్ కీపర్గా ఉండలేడు. ఇకవేళ కీపర్ గాయపడితే.. రాహుల్ని ఆ స్థానంలో ఆడించవచ్చు. ఇక సంజూ శాంసన్, రిషబ్ పంత్లు కూడా ధోనీ స్థానాన్ని భర్తీ చేయలేరు. సచిన్, ద్రవిడ్లు రిటైర్ కావడంతో ఏర్పడిన ఖాళీని కోహ్లీ, రోహిత్, రహానే, పుజారాలు భర్తీ చేశారు. కానీ ధోనీ విషయంలో అలా జరగదని నాకు అనిపిస్తుంది. అతని లాంటి వికెట్ కీపర్ మరొకరు ఉండరు. కాబట్టి అతన్ని తొందరపాటులో పక్కన పెట్టవద్దు’’ అని కైఫ్ తెలిపారు.