IPL 2023: వచ్చే సీజన్కు ఆడడంపై క్లారిటీ ఇచ్చేసిన ధోనీ
ABN , First Publish Date - 2022-05-21T02:03:43+05:30 IST
మహేంద్రసింగ్ ధోనీ.. చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోనీ.. ధోనీ అంటే సీఎస్కే అనేలా పెనవేసుకుపోయింది ఆ బంధం
ముంబై: మహేంద్రసింగ్ ధోనీ.. చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోనీ.. ధోనీ అంటే సీఎస్కే అనేలా పెనవేసుకుపోయింది ఆ బంధం. ఈ సీజన్లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో తేలిపోయిన ధోనీ సేన పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలోనే మిగిలిపోయింది. దారుణ పరాజయాలతో ప్లే ఆఫ్స్కు చేరకుండానే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో నేడు రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్ తర్వాత ఐపీఎల్కు ధోనీ గుడ్బై చెప్పబోతున్నట్టు పుకార్లు షికారు చేశాయి.
ఈ ఊహాగానాలపై ధోనీ తాజాగా స్పందించాడు. 2023 సీజన్లో చెన్నైకి తానే సారథ్యం వహిస్తానని చెబుతూ పుకార్లకు చెక్ పెట్టాడు. వచ్చే సీజన్లోనూ చెన్నై అభిమానులు మిమ్మల్ని యెల్లో జెర్సీలో చూడగలరా? అన్న ప్రశ్నకు ధోనీ స్పందిస్తూ.. వచ్చే సీజన్లో తప్పకుండా ఆడతానని బదులిచ్చాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ కనుక దేశవ్యాప్తంగా జరిగితే అప్పుడు అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేసే అవకాశం తనకు లభిస్తుందన్నాడు. సీఎస్కేకు ఆడకుండా థ్యాంక్స్ చెప్పడం సరికాదని ధోనీ అభిప్రాయపడ్డాడు.