రక్షణ మంత్రిత్వశాఖ ప్యానెల్లో ఎంఎస్ ధోనీ
ABN , First Publish Date - 2021-09-17T22:14:27+05:30 IST
టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి మరో గౌరవం లభించింది. అయితే, ఇది
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి మరో గౌరవం లభించింది. అయితే, ఇది ఈసారి క్రికెట్ ప్రపంచానికి బయట. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) మరింత సమగ్రంగా ఉండేలా సమీక్షించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన 15 మందితో కూడిన ప్యానెల్లో ధోనీకి చోటు లభించింది. ధోనీకి ఇప్పటికే లెఫ్టినెంట్ కల్నల్గా గౌరవ హోదా ఉంది. ధోనీ ఇటీవల జమ్మూకశ్మీర్లో ఆర్మీతో కలిసి చాలా రోజులు గడిపాడు. పారాచూట్ రెజిమెంట్లో శిక్షణ కూడా తీసుకున్నాడు.
మాజీ చట్ట సభ్యుడు బైజయంత్ పాండా ఈ ప్యానెల్కు సారథ్యం వహిస్తారు. ధోనీతోపాటు వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా, కల్నల్ (రిటైర్డ్) రాజ్యవర్ధన్సింగ్ రాథోడ్, రాజ్యసభ సభ్యుడు వినయ్ సహస్రబుద్ధె, ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రిన్సిపల్ ఎకనమిక్ అడ్వైజర్ సంజీవ్ సన్యాల్, జామియా మిలియా వైస్ చాన్స్లర్ నజ్మా అక్తర్ వంటివారు ఈ ప్యానెల్లో ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్లో ఆడే భారత జట్టుకు ధోనీని బీసీసీఐ ఇటీవల మెంటార్గా నియమించింది. ఇప్పుడు రక్షణ మంత్రిత్వశాఖ ప్యానెల్లో చోటు దక్కించుకోవడంతో ధోనీ అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.