బ్రేకింగ్ న్యూస్: చెన్నై పగ్గాలు మళ్లీ ధోనీకే!

ABN , First Publish Date - 2022-05-01T01:28:05+05:30 IST

వరుస పరాజయాలతో కుంగిపోయిన డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు కొత్త

బ్రేకింగ్ న్యూస్: చెన్నై పగ్గాలు మళ్లీ ధోనీకే!

ముంబై: వరుస పరాజయాలతో కుంగిపోయిన డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు కొత్త కళ రానుంది. ఆ జట్టు మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు అందుకోబోతున్నాడు. ఈ మేరకు సీఎస్‌కే.. అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఆటపై మరింతగా దృష్టిపెట్టాలని రవీంద్ర జడేజా భావించాడని, అందుకని బాధ్యతలను తిరిగి ధోనీకి అప్పగించాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొంది. ఇదే విషయమై ధోనీని కలిసి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాలని కోరామని, జట్టు ప్రయోజనాలతోపాటు ఆటపై జడేజా మరింతగా దృష్టి కేంద్రీకరించాలన్న ఉద్దేశంతో ధోనీ అందుకు అంగీకరించాడని పేర్కొంది.  


సీఎస్‌కే‌కు ఈ సీజన్ కలిసి రాలేదు. ఆరంభంలోనే ఎదురైన ఓటమి ఆ తర్వాత కూడా వరుసగా వెక్కిరించింది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే రెండింటిలో మాత్రమే విజయం సాధించి కింది నుంచి రెండో స్థానంలో ఉంది. ఇంకా ప్లే ఆఫ్స్‌కు అవకాశం ఉండడం, ధోనీ ఇప్పుడు జట్టు బాధ్యతలు స్వీకరించనుండడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ధోనీ రావడంతో సీఎస్కే రాత మారుతుందేమో చూడాలి.



Updated Date - 2022-05-01T01:28:05+05:30 IST