సభ్యులు గూండాల్లా ప్రవర్తించారు : ప్రహ్లాద్ జోషి

ABN , First Publish Date - 2020-09-21T19:01:22+05:30 IST

ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయడంపై విపక్షాలు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నాయి.

సభ్యులు గూండాల్లా ప్రవర్తించారు : ప్రహ్లాద్ జోషి

న్యూఢిల్లీ : ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయడంపై విపక్షాలు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ... రాజ్యసభ చైర్మన్ నోటి నుంచి ఏ సభ్యుడి పేరైతే వస్తుందో ఆ సభ్యుడు వెంటనే సభ నుంచి నిష్క్రమించాలని స్పష్టం చేశారు. 8 మంది సభ్యులు సభలో తప్పుగా ప్రవర్తించారని ఆయన మండిపడ్డారు. గూండాల్లాగా ప్రవర్తించారని, ప్రజాస్వామ్యంపై వారికి నమ్మకం లేదని స్వయంగా వారే చూపించుకున్నారని ప్రహ్లాద్ జోషి ఘాటుగా విమర్శించారు.


మరోవైపు సస్పెషన్‌ను నిరసిస్తూ ఎంపీలు పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు. వివాదాస్పద వ్యవసాయ రంగ బిల్లులపై ఆదివారం రాజ్యసభలో రభస సృష్టించిన ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు నిర్ణయం తీసుకోవడంపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. సస్పెండ్ అయిన సభ్యులు సభ నుంచి బయటికి వెళ్లేందుకు అంగీకరించకపోవడం.. పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో రాజ్యసభ ఇవాళ పలుమార్లు వాయిదా పడింది. సస్పెండ్ అయిన ఎంపీలు బయటికి వెళ్లాల్సిందేనంటూ ఉపసభాపతి స్పష్టం చేశారు. 

Updated Date - 2020-09-21T19:01:22+05:30 IST