రాహుల్ మళ్లీ పగ్గాలు చేపట్టాలి
ABN , First Publish Date - 2020-07-12T07:53:56+05:30 IST
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మళ్లీ పగ్గాలు చేపట్టాలని పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ లోక్సభ సభ్యులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) ద్వారా సమావేశమయ్యారు...
- సోనియాతో సమావేశంలో ఎంపీల డిమాండ్
- కొవిడ్, గల్వాన్లపై చర్చ!
న్యూఢిల్లీ, జూలై 11: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మళ్లీ పగ్గాలు చేపట్టాలని పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ లోక్సభ సభ్యులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) ద్వారా సమావేశమయ్యారు. దేశంలో కొవిడ్-19, గల్వాన్ లోయలో భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు, పెట్రో ధరల పెరుగుదల, రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మోదీ సర్కారును ఇరుకునపెట్టేందుకు ఈ అంశాలను లేవనెత్తాలని ఎంపీలకు సోనియా సూచించినట్లు సమాచారం. ఈ సందర్భంగా పార్టీ నాయకత్వం ప్రస్తావనకు వచ్చింది. రాహుల్ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు. లోక్సభలో కాంగ్రెస్ విప్ కె.సురేష్ మొదట ఈ డిమాండ్ను లేవనెత్తగా.. తర్వాత ఎంపీలు ఆయనతో గళం కలిపారు. కరోనా కష్టకాలంలో ప్రజల సమస్యలపై పోరాడుతున్న రాహుల్.. మళ్లీ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఉందని సురేష్ అన్నట్లు సమాచారం.