ధాన్యం కొనుగోలు సమయాన్ని పెంచాలి
ABN , First Publish Date - 2020-11-29T05:42:58+05:30 IST
తుఫాన్ ప్రభావం కారణంగా ధాన్యం కొనుగోలు సమయాన్ని పెంచాలని, ఆలస్యంగా తెచ్చిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని ఎంపీపీ పురం నవనీత కోరారు.
మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ నవనీత
మనోహరాబాద్, నవంబరు 28: తుఫాన్ ప్రభావం కారణంగా ధాన్యం కొనుగోలు సమయాన్ని పెంచాలని, ఆలస్యంగా తెచ్చిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని ఎంపీపీ పురం నవనీత కోరారు. శనివారం జరిగిన సర్వ సభ్యసమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు 4 వేల క్వింటాళ్ల వరి ధాన్యం, సుమారు 2 వేల క్వింటాళ్ల మొక్క జొన్నలు కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపారు. అన్నీ గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటును పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటుకు ప్రతిపాదనలు కూడా పంపామని, త్వరలో ఏర్పాటయ్యే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మండలానికి 190 ధాన్యం కల్లాలు మంజూరయ్యాయని, వాటిని త్వరలో ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఐసీడీఎస్ సిబ్బంది కవిత మాట్లాడుతూ గ్రామాల్లో ఇంకా బాల్య వివాహాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తహసీల్దార్ కిషోర్ మాట్లాడుతూ ధరణి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ర్టేషన్లు 15 నిమిషాల్లో పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఏవైనా భూములకు సంబంధించి కోర్టు కేసులుంటే రిజిస్ర్టేషన్లను నిలిపివేస్తామని, అలాంటివి ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమావేశంలో మండల ప్రత్యేకాధికాని కృష్ణమూర్తి, ఎంపీడీవో జైపాల్రెడ్డి, మిషన్ భగీరథ డీఈఈ శ్రీనివా్సతో పాటు ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
మండల పరిషత్కు రూ.11 లక్షలు మంజూరు
మండల పరిషత్కు రూ.11 లక్షలు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 7 లక్షలు, ఎస్ఎ్ఫసీ నిధులు రూ. 4 లక్షలు మంజూరైనట్లు పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటైన మనోహరాబాద్ మండలానికి తూప్రాన్ మండల పరిషత్ నుంచి విడిపోయినప్పుడున్న నిధుల్లో నుంచి వాటాగా గతంలో రూ.17 లక్షలు మంజూరవగా రూ.12 లక్షలను పోతారం, పర్కింబడ గ్రామాలకు, రూ.4 లక్షలు మనోహరాబాద్, జీడిపల్లి, లింగారెడ్డిపేట, రంగాయిపల్లి గ్రామాల అభివృద్ధికి కేటాయించారు. ప్రస్తుతం మరోసారి నిధులు రావడంతో మరిన్ని పనులు చేపట్టే అవకాశముంది.