జగన్‌పై ప్రజలకు మోజు తగ్గింది: ఎంపీ రామ్మోహన్

ABN , First Publish Date - 2022-02-14T17:32:12+05:30 IST

టీడీపీ సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో పనిచేస్తుందని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.

జగన్‌పై ప్రజలకు మోజు తగ్గింది: ఎంపీ రామ్మోహన్

శ్రీకాకుళం: టీడీపీ సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో పనిచేస్తుందని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై ప్రజలకు మోజు తగ్గిందని, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ప్రారంభమయ్యిందన్నారు. ప్రజలు టీడీపీ వైపు చూస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నవరత్నాలు సైతం సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శించారు. పేదవాడు దౌర్భాగ్య పరిస్థితి అనుభవిస్తున్నాడని తెలిపారు. గ్రామ సచివాలయాలు సక్రమంగా పనిచేయటం లేదని, ప్రజలు తమ సమస్యలపై టీడీపీని ఆశ్రయిస్తున్నట్లు చెప్పారు.


పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదాపై నోరు మెదపడం లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ అజెండాలో ప్రత్యేక హోదా అంశం పెడితే వైసీపీ తమ గొప్పతనం అన్నట్టు హంగామా చేశారన్నారు. గంటల వ్యవధిలో కేంద్రం హోదాను అజెండా నుంచి తీసేసిందని తెలిపారు. వైసీపీ ఎంపీలు కేంద్రంపై ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. స్టాలిన్, కేసీఆర్, మమతలు కేంద్రంపై పోరాడుతున్నారన్నారు. జగన్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారని నిలదీశారు. జగన్ పులకేసి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. టికెట్లు వ్యవహారంలో సమస్య సృష్టించి హీరోలతో పొగిడించుకుంటున్నారని... జగన్ సినిమా నటుల్ని మించి నటన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్ నటన చూసి ఇండస్ట్రీ దండం పెడుతోందన్నారు. ప్రత్యేక హోదాపై వైసీపీ కి చిత్తశుద్ధి ఉంటే ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామాలకు టీడీపీ సిద్ధంగా ఉందని  ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. 

Updated Date - 2022-02-14T17:32:12+05:30 IST