రాజ్యసభ సభ్యులుగా కనిమొళి, రాజేశ్‌కుమార్‌, అబ్దుల్లా ప్రమాణం

ABN , First Publish Date - 2021-11-30T15:43:08+05:30 IST

రాజ్యసభకు ఎంపికైన ముగ్గురు డీఎంకే సభ్యులు సోమవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. అన్నాడీఎంకేకు చెందిన రాజ్యసభ సభ్యులు కేపీ మునుసామి, వైద్యలింగం గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడంతో

రాజ్యసభ సభ్యులుగా కనిమొళి, రాజేశ్‌కుమార్‌, అబ్దుల్లా ప్రమాణం

చెన్నై: రాజ్యసభకు ఎంపికైన ముగ్గురు డీఎంకే సభ్యులు సోమవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. అన్నాడీఎంకేకు చెందిన రాజ్యసభ సభ్యులు కేపీ మునుసామి, వైద్యలింగం గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన ఆ రెండు రాజ్యసభ స్థానాలకు డీఎంకే వైద్య విభాగ ప్రతినిధి కనిమొళి సోము, కేఆర్‌ఎన్‌ రాజేశ్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక మరో అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు మహమ్మద్‌ జాన్‌ అనారోగ్యం కారణంగా గత మార్చి 23న మృతి చెందారు. దీంతో ఖాళీ అయిన ఆ స్థానానికి డీఎంకే తరఫున ఎంఎం.అబ్దుల్లా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో డీఎంకే రాజ్యసభ ఎంపీలు కనిమొలి సోము, కేఆర్‌ఎన్‌ రాజేష్‌కుమార్‌, ఎంఎం.అబ్దుల్లా చేత రాజ్యసభ చైర్మన్‌, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు. ఈ ముగ్గురూ తమిళంలోనే ప్రమాణం చేయడం విశేషం. ఇదిలా ఉండగా కేఆర్‌ఎన్‌ రాజేష్‌కుమార్‌ ప్రమాణస్వీకారం చివరలో ‘దళపతి వర్థిల్లాలి... అన్నయ్య ఉదయనిధి వర్థిల్లాలి’ అంటూ నినాదాలు చేయడం వివాదాస్పదమైంది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని ప్రమాణస్వీకారం సమయంలో చేసే ఇలాంటి నినాదాలు సభ రికార్డులలో నమోదుకావని చెప్పారు. ఇలాంటి నినాదాలను సభ్యులు సభ వెలుపల చేసుకోవచ్చని హితవు పలికారు. కాగా కొత్తగా ప్రమాణంస్వీకారం చేసిన ముగ్గురు రాజ్యసభ సభ్యులను సీనియర్లయిన తిరుచ్చి శివ, విల్సన్‌ తదితరులు అభినందించారు.

Updated Date - 2021-11-30T15:43:08+05:30 IST