స్వతంత్ర ఎంపీగా గుర్తించండి
ABN , First Publish Date - 2021-06-15T08:44:59+05:30 IST
‘రాజద్రోహం కేసులో నన్ను అక్రమంగా అరెస్ట్ చేయడమే గాక ఎంపీనని కూడా చూడకుండా భౌతికంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఏపీ సీఐడీ పోలీసులు, ఇతర కుట్రదారులపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు
అనర్హత ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవద్దు
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు
లోక్సభ స్పీకర్తో భేటీలో ఎంపీ రఘురామ
న్యూఢిల్లీ, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ‘రాజద్రోహం కేసులో నన్ను అక్రమంగా అరెస్ట్ చేయడమే గాక ఎంపీనని కూడా చూడకుండా భౌతికంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఏపీ సీఐడీ పోలీసులు, ఇతర కుట్రదారులపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోండి. ఇందుకోసం వెంటనే ప్రివిలేజ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయండి’ అని నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ కే రఘురామకృష్ణరాజు.. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చే శారు. సోమవారం సాయంత్రం ఇక్కడ ఓం బిర్లా నివాసంలో రఘురామరాజు కలసి నాలుగు పేజీలతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను నిలదీయడంతో పాటు అక్రమాస్తుల కేసులో సీఎం వైఎస్ జగన్రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో కేసు దాఖలు చేశానన్న కక్షతోనే తనపై అక్రమంగా రాజద్రోహం కేసు పెట్టి, దాడి చేశారని మరోసారి స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ నేతలు, ఎంపీలు తనపై అనర్హత వేటు వేయాలంటూ చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవద్దని, పార్టీ ఫిరాయింపుల నిషేధచట్టం కింద తనపై చర్యలు తీసుకోవద్దని స్పీకర్ను కోరారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తాను పాల్పడలేదని, ఎన్నికలు సందర్భంగా ప్రజలకిచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకునే విషయాన్ని మాత్రమే గుర్తు చేస్తున్నానన్నారు. వైఎ్సఆర్సీపీ అధికారిక వెబ్సైట్లో ఉండే ఎంపీల జాబితా నుంచి తన పేరును తొలగించారని ఫిర్యాదు చేశారు. 48 గంటల్లోగా తన పేరును మళ్లీ వెబ్సైట్లో చేర్చకపోతే, స్వతంత్ర అభ్యర్థిగా తనను ప్రకటించాలని పార్లమెంటు సెక్రటేరియట్కు ఫిర్యాదు చేస్తానంటూ వైసీపీ అధినేత జగన్రెడ్డికి తాను లేఖ రాసినా పట్టించుకోవడంలేదని రఘురామరాజు తెలిపారు. అందువల్ల తనను స్వత్రంత్ర ఎంపీగా గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని స్పీకర్ను రఘురామరాజు కోరారు.