నీతులు చెబుతున్న ‘బెయిల్ బ్యాచ్’
ABN , First Publish Date - 2021-07-28T08:40:24+05:30 IST
‘‘దొంగలంతా కలిసి నాపై అసత్య ఆరోపణలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు ఫిర్యాదు చేస్తారా? మంత్రితో విజయసాయిరెడ్డి మాట్లాడింది నా గురించే..
- మీ అందరి బాగోతం తేలుస్తా
- ఆర్థిక మంత్రి నిర్మలతో సాయిరెడ్డిపోలవరం, హోదాలపై చర్చించలేదు
- సీఐడీ ఏడీజీ సునీల్... నా ఫోన్ దొంగ
- దాని నుంచి దొంగ మెసేజ్ పెట్టి ఫిర్యాదు
- దొంగలంతా కలిసి నాపై ఫిర్యాదు చేస్తారా?
- వైసీపీ ఎంపీ రఘురామరాజు ధ్వజం
న్యూఢిల్లీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): ‘‘దొంగలంతా కలిసి నాపై అసత్య ఆరోపణలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు ఫిర్యాదు చేస్తారా? మంత్రితో విజయసాయిరెడ్డి మాట్లాడింది నా గురించే తప్ప, పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై కాదు. దొంగపద్దులు రాసే సాయిరెడ్డి బయటకు చెప్పిందంతా అబద్ధమే’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆపార్టీ పార్లమెంటరీపార్టీ నేత విజయసాయిరెడ్డిపై ధ్వజమెత్తారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్ కుమార్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. సునీల్ తన ఫోన్ను తస్కరించిన తర్వాత దాని నుంచి కొన్ని దొంగ మెసేజ్లు ఇతరులకు పంపించారని.. ఆ మెసేజ్లతోనే తనపై ఫిర్యాదు చేశారని ఆరోపించారు. బెయిల్ బ్యాచ్ ఏ-1, ఏ-2, సునీల్ ముగ్గురు దొంగలని, వారు నీతులు చెప్పడమేంటనిఽ ధ్వజమెత్తారు. ‘‘వీరి అసలు బాగోతం బయటపెడతా?’’ అని రఘురామ హెచ్చరించారు. కాగా..ప్రభుత్వం సేకరించిన ఆవ భూముల్లో ముఖ్యమంత్రి బాబాయి పాత్ర ఉందని, ఈ భూ బాగోతంలో రూ.130 కోట్లు కొట్టేశారని రఘురామరాజు ధ్వజమెత్తారు. తొలి నుంచి ఆవభూముల భవిష్యత్ గురించి తాను చెబుతూనే ఉన్నానని, అయినా ప్రభుత్వం లెక్క చేయలేదన్నారు. ఇవి ఇళ్ల నిర్మాణానికి పనికిరాకపోయినా, నేతల దోపిడీకోసమే పెద్ద మొత్తంలో ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆరోపించారు. ఆవభూముల కుంభకోణంపై ప్రధాని, ఆర్థిక మంత్రులకు ఫిర్యాదు చేస్తానని రఘురామ తెలిపారు.