భీమవరంలో ఎంపీ రఘురాజు కార్యాలయం పేరు మార్పు

ABN , First Publish Date - 2020-09-18T18:49:58+05:30 IST

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కార్యాలయం పేరు మారింది.

భీమవరంలో ఎంపీ రఘురాజు కార్యాలయం పేరు మార్పు

ఏలూరు : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కార్యాలయం పేరు మారింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న ఎంపీ కార్యాలయం పేరును శుక్రవారం నాడు మార్చేశారు. ఇదివరకున్న పేరుకాకుండా ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ’ కార్యాలయంగా మార్చడం జరిగింది. అంతేకాదు.. ఫ్లెక్సీల్లో ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ఫొటోలు కూడా తొలగించారు. కాగా గతంలో ఎంపీ కార్యాలయానికి ‘వైఎస్సార్ కాంగ్రెస్ నరసాపురం పార్లమెంట్ సభ్యుల వారి కార్యాలయం’ అని పేరు ఉన్నది. దీన్ని ఇవాళ మార్చేశారు. ఈ మార్పు వ్యవహారంపై ఎంపీ ఇంతవరకూ స్పందించలేదు.


త్వరలోనే తేలుస్తా..!

కాగా.. ఇవాళ కూడా రఘురాజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌ లోపల, బయట న్యాయవ్యవస్థపై దాడి జరుగుతోందని రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ కోర్టులపై ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ ఎంపీలపై మండిపడ్డారు. 151 సీట్లు వచ్చినంత మాత్రాన రాజ్యాంగాన్ని మార్చలేరని వ్యాఖ్యానించారు.


నా సహచర ఎంపిలతోనే నన్ను కొట్టిస్తా అంటూ నీచంగా మాట్లాడిస్తున్నారు. వారి భవిష్యత్ ఏంటో త్వరలోనే తేలుస్తా. ఆకు రౌడీలు ఏదో చేస్తారని భయపడే స్థాయిలో నేను లేను. నా ఒంటిపై చేయి పడితే నన్ను కాపాడేందుకు హేమహేమీలున్నారు. పులివెందులలో 10 వేల మందితో సమావేశం పెడతాను. అక్కడ నన్ను ప్రేమించేవారున్నారు. ప్రభుత్వం ఎన్ని ఉన్మాద చర్యలు చేసిన కోర్టులు చిరంజీవులుగా మిగులుతాయి. రాబోయే రోజులన్నీ మంచిరోజులే. అమరావతి రైతులెవరు ఆందోళన చెందద్దు. ప్రత్యేక హోదా మా పార్టీ ప్రాధాన్యత అంశంగా కనిపించడం లేదుఅని వైసీపీ ఎంపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.




Updated Date - 2020-09-18T18:49:58+05:30 IST