రాహుల్‌పై ప్రశ్నల వర్షం కురిపించి హర్ సిమ్రత్ కౌర్

ABN , First Publish Date - 2021-01-16T01:41:41+05:30 IST

ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా ట్విట్టర్

రాహుల్‌పై ప్రశ్నల వర్షం కురిపించి హర్ సిమ్రత్ కౌర్

న్యూఢిల్లీ : ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా ట్విట్టర్ మాధ్యమంగా పలు ప్రశ్నలను సంధించారు. మొదలు తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చి, ఆ తర్వాత రైతుల గురించి మాట్లాడాలని రాహుల్‌కు చురకలంటించారు. ‘‘రైతులను ఖలిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చడంపై రాహుల్ మొసలి కన్నీరు కారుస్తున్నారు. కానీ... మీ నానమ్మ పంజాబీల మాట వచ్చినప్పుడల్లా ఖలిస్తాన్ అన్న శబ్దాన్ని ప్రయోగించేవారు. మాదక ద్రవ్యాలకు పంజాబీలు బానిసలయ్యారన్న పేరు పెట్టారు. వీటన్నింటికీ మొదట సమాధానాలు చెప్పిన తర్వాత, పంజాబ్ రైతుల గురించి మాట్లాడండి.’’ అని హర్ సిమ్రత్ కౌర్ ట్వీట్ చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు ధర్నా చేస్తున్న సమయంలో, సభలో బిల్లు ఆమోదం పొందిన సందర్భంలో రాహుల్ ఎక్కడున్నారని ఆమె నిలదీశారు. అంతేకాకుండా ఈ సమయంలో కాంగ్రెస్‌కు చెందిన 40 మంది సభ్యులు సభలో లేరని, సీఎం అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌తో ఉన్నారని హర్ సిమ్రత్ కౌర్ విమర్శించారు. 

Updated Date - 2021-01-16T01:41:41+05:30 IST