వైసీపీ, బీజేపీలతో రాష్ట్రం నాశనం
ABN , First Publish Date - 2021-03-01T05:48:54+05:30 IST
వైసీపీ, బీజేపీలు కలసి ఏపీని నాశనం చేస్తున్నారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు.
అక్రమార్జనే ధ్యేయంగా వైసీపీ పాలన
టీడీపీకి ఓటు వేస్తే అభివృద్ధికి వేసినట్లే..
ఎంపీ గల్లా జయదేవ్, శ్రావణ్కుమార్
గుంటూరు, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): వైసీపీ, బీజేపీలు కలసి ఏపీని నాశనం చేస్తున్నారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన నగర కార్పొరేషన్ ఎన్నికల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గల్లా మాట్లాడుతూ సీఎం జగన్ విభజన హామీలపై కనీసం నోరు మెదపటం లేదన్నారు. టీడీపీకి ఓటు వేస్తే అభివృద్ధికి వేసినట్లేనని, పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిచేలా ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా చేయాలని సూచించారు. గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ ఓటర్ లిస్టును తమకు అనుకూలంగా మార్చుకుందన్నారు. పోలింగ్ బూతులను తమకు బలమున్న ప్రాంతాల్లోకి మార్చారని ఆరోపించారు. ఎన్నికలు అయిన మరుక్షణమే రిజిస్ట్రేషన్ ధరతో సమానంగా ఇంటిపన్ను పెంచబోతున్నారని తెలిపారు. జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్ నసీర్ మాట్లాడుతూ రాజధాని అమరావతి ప్రాంత పరిధిలోని గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిస్తేనే అధినేత చంద్రబాబు చేసిన కృషికి ఫలితం వచ్చినట్లన్నారు. మేయర్ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ టీడీపీ జెండాను కార్పొరేషన్ ఎన్నికలలో ఎగరవేయబోతున్నామని తెలిపారు. అనంతరం గుంటూరు పార్లమెంట్ నుంచి రాష్ట్ర కమిటీకి ఎన్నికైనవారికి నేతలు సత్కరించారు. కార్యక్రమంలో నేతలు డాక్టర్ మాకినేని పెదరత్తయ్య, గంజి చిరంజీవి, దాసరి రాజామాస్టారు, డేగల ప్రభాకరరావు, పోతినేని శ్రీనివాసరావు, పిల్లి మాణిక్యరావు, ఎండీ హిదాయత్, మానుకొండ శివప్రసాద్, చిట్టాబత్తిని చిట్టిబాబు, బుచ్చి రాంప్రసాద్, కనపర్తి శ్రీనివాసరావు, వడ్రాణం హరిబాబు, అన్నాబత్తిని జయలక్ష్మి, రిజ్వానా, నాయుడు ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.