‘గిరి’ కోర్టు నుంచి.. ఢిల్లీ కోటకు..!
ABN , First Publish Date - 2020-09-17T16:37:35+05:30 IST
తిరుపతి పార్లమెంట్ సభ్యుడు, గూడూరు నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా..
సామాన్య కుటుంబం నుంచి ఉన్నత శిఖరాలకు..
కరోనాతో ముగిసిన బల్లి దుర్గాప్రసాద్ ప్రస్థానం
‘నల్లపరెడ్డి’ ఆశీస్సులతో రాజకీయాల్లోకి..
4సార్లు గూడూరు ఎమ్మెల్యేగా విజయం
టీడీపీ అధినేత చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా..
2019లో చివరి నిమిషంలో వైసీపీలోకి జంప్!
తిరుపతి ఎంపీగా విజయం
హఠాన్మరణంతో అభిమానుల్లో తీవ్ర విషాదం
నెల్లూరు(ఆంధ్రజ్యోతి): తిరుపతి పార్లమెంట్ సభ్యుడు, గూడూరు నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజకీయ దురంధరుడు.. 2019 ఎన్నికల్లో అత్యంత అదృష్టవంతుడిగా గుర్తింపబడిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ను దురదృష్టం మృత్యువు రూపంలో కబళించింది. కరోనా బారిన పడినా చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనతికాలంలోనే కోలుకున్నారు. అయితే, వైరస్ ద్వారా సోకిన ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులు అక్కడ నుంచి గుండెకు సోకింది. దీంతో గుండెపోటుకు గురై బుధవారం సాయంత్రం హఠాన్మరణం పొందారు.
అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించిన దుర్గాప్రసాద్ తన అసాధారణ ప్రతిభ, పట్టుదల, విశ్వసనీయతల కారణంగా గొప్ప శిఖరాలను ఎక్కగలిగారు. తిరుపతిలోని రఎస్వీ యూనివర్సిటీలో లా పట్టా అందుకున్న దుర్గాప్రసాద్ వెంకటగిరి కోర్టులో అడ్వకేట్గా జీవితం ఆరంభించారు. కొద్ది కాలానికే ఈ వృత్తికి గుడ్బై చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దివంగత నేత నలపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆశీస్సులతో 1981లో వెంకటగిరి సమితి అధ్యక్ష స్థానానికి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఈయన్ను ఓటమి వరించింది. తెలుగుదేశం ఆవిర్భావంతో ఆయనకు రాజకీయ పదవీయోగం పట్టింది. 1985 ఎన్నికల్లో గూడూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1994, 1999, 2009 ఎన్నికల్లో గూడూరు నుంచే ఎమ్మెల్యేగా (టీడీపీ) ఎన్నికయ్యారు. 1996-98 మధ్యకాలంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కేబినెట్లో రాష్ట్ర ప్రాఽథమిక విద్యా శాఖ మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి తిరుపతి పార్లమెంట్కు పోటీ చేసి విజయం సాధించారు.
15 రోజుల పోరాటం
సరిగ్గా 15 రోజుల క్రితం ఎంపీ దుర్గాప్రసాద్కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఈయన చెన్నైలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో చేరారు. 10 రోజులకే ఈయనలో వైరస్ ప్రభావం తగ్గింది. రిపీట్ టెస్టులో నెగిటివ్ వచ్చింది. అయితే కరోనా వైరస్ కారణంగా ఈయ న ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురయ్యాయి. దీంతో ఆసుపత్రి వర్గా లు ఊపిరితిత్తులకు చికిత్స ప్రారంభించారు. ఈ చికిత్స జరుగుతుండగనే ఆ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల నుంచి గుండెకు వ్యాపించింది. దీంతో బుధవారం సాయత్రం తీవ్రమైన గుండెపోటు రావడంతో దుర్గా ప్రసాద్ మృతి చెందారు.
కబళించిన దురదృష్టం
2019 ఎన్నికల్లో అత్యంత అదృష్టవంతుడిగా బల్లి దుర్గాప్రసాద్ గుర్తింపు పొందారు. టీడీపీ తరఫున సూళ్లూరుపేట అసెంబ్లీ స్థానం, లేదా తిరుపతి పార్లమెంట్ టికెట్లను ఆయన ఆశించారు. అయితే అక్కడ అనుకూల పరిస్థితులు లేవని గ్రహించి ఎన్నికల ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఈయనకు తిరుపతి వైసీపీ టికెట్టు దక్కడం, 2 లక్షల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. అదృష్టం అంటే బల్లి దుర్గాప్రసాద్దే కదా అని పది మంది అనుకులేలా చేసింది. అయితే, అనతికాలంలోనే కరోనా కారణంగా మొదలైన అనారోగ్యం దురదృష్టం రూపంలో ఈయన్ను కబళించింది.
వెంకటగిరిలో విషాదచాయలు
వెంకటగిరి: ఎంపీ బల్లి దుర్గాప్రసాద్రావు మృతితో వెంకటగిరిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణ వార్త తెలియగానే బంధువులు, అభిమానులు దుర్గాప్రసాద్ నివాసం వద్దకు చేరుకున్నారు. ఏ పార్టీలో ఉన్నా అందరినీ ఆప్యాయంగా పలకరించేవారంటూ గుర్తు చేసుకున్నారు. రోజంతా ఎక్కడ గడిపినా రాత్రి వెంకటగిరిలోని తన నివాసానికి చేరుకునేవారు. దుర్గాప్రసాద్ రావు మృతి తెలియగానే దిగ్ర్భాంతికి లోనయ్యామని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర అన్నారు. వైసీపీ నాయకులు కలిమలి రాంప్రసాద్రెడ్డి, చెలికం శంకరరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అల్లం చంద్రహన్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ దొంతు శారద, టీడీపీ నాయకులు కెవికె ప్రసాద్, బీరం రాజేశ్వరారవు తదితరులు ప్రగాఢసంతాపం వెలుబుచ్చారు. అలాగే మనుబోలు మండలం వెంకన్నపాళెంకు చెందిన ఎంపీ స్నేహితుడు వీఏ. పద్మనాభ రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.
ఆటుపోట్ల రాజకీయం
బల్లి దుర్గాప్రసాద్ తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. 1989 ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా 2004లో ఈయనకు టిక్కెట్టు దక్కలేదు. తిరిగి 2014లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా మళ్లీ నిరాశే ఎదురైంది.
పలువురి సంతాపం
నెల్లూరు: ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠన్మరణంపై జిల్లాలోని వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు. జిల్లా మంత్రులు అనిల్కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డిలు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్రెడ్డి, ఆనం రామనారా యణరెడ్డి సంతాపం తెలిపారు. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామ కృష్ణ, నేతలు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, రమే్షరెడ్డి, అనురాధ, వేనాటి రామచంద్రారెడ్డి, పరసారత్నం తదితరులు కూడా దుర్గాప్రసాద్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. సుధీర్ఘ కాలం టీడీపీలో కలిసి పని చేశామంటూ ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్రావుపై కలెక్టర్ చక్రధర్బాబు సంతాపం తెలియచేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్న ప్రకటించారు.