బొమ్మ పడింది

ABN , First Publish Date - 2021-07-31T05:59:46+05:30 IST

కరోనా కారణంగా మూతపడిన సినిమా థియేటర్లు శుక్రవారం తెరుచుకున్నాయి.

బొమ్మ పడింది

మూడు నెలల విరామం తర్వాత తెరుచుకున్న థియేటర్లు

నగరంలో 12, రూరల్‌లో 3 థియేటర్లలో సినిమాల ప్రదర్శన

విశాఖపట్నం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా మూతపడిన సినిమా థియేటర్లు శుక్రవారం తెరుచుకున్నాయి. జిల్లావ్యాప్తంగా 15 థియేటర్లలో సినిమాలను ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ సగం మంది ప్రేక్షకులనే అనుమతించారు. 


జిల్లా వ్యాప్తంగా సుమారు వందకుపైగా థియేటర్లు ఉన్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించడంతో ఏప్రిల్‌ 25 నుంచి థియేటర్లన్నీ మూతపడ్డాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. సినిమా థియేటర్లను 50 శాతం ప్రేక్షకులతో తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో నగర పరిధిలోని జగదాంబ, శారదా, మెలోడి, సంగం, శరత్‌, కిన్నెర, 104 ఏరియాలో లక్ష్మీనరసింహా, ఊర్వశితోపాటు గాజువాకలోని మూడు థియేటర్లలో సినిమాలను ప్రదర్శించారు. ఇవికాకుండా రూరల్‌ జిల్లాలో మరో మూడు థియేటర్లలో సినిమాలు ప్రదర్శించినట్టు సమాచారం. శనివారం నుంచి మరికొన్ని థియేటర్లలో సినిమాలను ప్రదర్శించేందుకు ఎగ్జిబిటర్లు చర్యలు ప్రారంభించారు. కొత్త సినిమాలు విడుదలయ్యేంత వరకూ ప్రేక్షకుల ఆదరణ అంతంతమాత్రంగానే ఉంటుందని, అయినప్పటికీ థియేటర్లను మూసి ఉంచకూడదనే ఉద్దేశంతో తెరుస్తున్నామని ఎగ్జిబిటర్లు పేర్కొంటున్నారు.  

Updated Date - 2021-07-31T05:59:46+05:30 IST