15 నుంచి సినిమా

ABN , First Publish Date - 2020-10-01T08:04:55+05:30 IST

కట్టడి ప్రాంతాల వెలుపల అన్ని సినిమా హాళ్లను అక్టోబరు 15 నుంచి తెరుచుకోవచ్చని కేంద్రం ప్రకటించింది...

15 నుంచి సినిమా

థియేటర్ల సామర్థ్యంలో సగం మంది ప్రేక్షకులే ఉండాలి


  • స్కూళ్లు, కాలేజీలూ తెరవొచ్చు
  • తుది నిర్ణయం మాత్రం రాష్ట్రాలదే
  • ఈత కొలనులు, పార్కులకూ ఓకే
  • నేటి నుంచి మరిన్ని వెసులుబాట్లు
  • అన్‌లాక్‌-5పై కేంద్రం ప్రకటన


న్యూఢిల్లీ, సెప్టెంబరు 30: కట్టడి ప్రాంతాల వెలుపల అన్ని సినిమా హాళ్లను అక్టోబరు 15 నుంచి తెరుచుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. అయితే హాళ్లలో ప్రేక్షకుల సంఖ్య సగానికి సగం తగ్గించాలనీ, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. అన్‌లాక్‌-5 మార్గదర్శకాలను బుధవారంనాడు హోంశాఖ ప్రకటించింది. ఇవి గురువారం నుంచి అమల్లోకొస్తాయి. స్కూళ్లు, కాలేజీలను కూడా 15 నుంచి తెరవవచ్చనీ, అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయమనీ హోంశాఖ తెలిపింది. 


అన్‌లాక్‌-5లో ఉన్నవేంటి..?

సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకోవచ్చు. సీటింగ్‌ సామర్థ్యంలో సగం మందిని మాత్రమే అనుమతించాలి. ఇందులో కూడా గరిష్ఠ పరిమితి 200. దీనికి మించరాదు. మాస్కులు, శానిటైజర్లు, థర్మల్‌ స్ర్కీనింగ్‌ ఏర్పాట్లు తప్పనిసరి. ఇందుకు సంబంధించిన విధివిధానాలను (ఎస్‌వోపీ) సమాచార ప్రసార శాఖ విడిగా విడుదల చేస్తుంది


బిజినెస్‌ టు బిజినెస్‌ (బీటూబీ) ఎగ్జిబిషన్లు... వాణిజ్యశాఖ విధివిధానాలను ఇస్తుంది


క్రీడాకారులకు శిక్షణనిచ్చే ఈతకొలనులు--- యువజన వ్యవహారాల శాఖ ఎస్‌వోపీలను ఇస్తుంది


వినోద పార్కులు --- ఆరోగ్య శాఖ ఎస్‌వోపీ విడుదల చేస్తుంది.


స్కూళ్లు, కోచింగ్‌ సెంటర్లను 15 నుంచి తెరవవచ్చు. కానీ రాష్ట్రప్రభుత్వాలు పరిస్థితిని అంచనా వేసి- స్కూళ్ల యాజమాన్యాలతో సంప్రదించి- నిర్ణయం తీసుకోవాలి. ఇందులోనూ కొన్ని నిబంధనలు పాటించాలి.


1) ఆన్‌లైన్‌ లేదా దూర విద్యా బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలి

2) విద్యార్థులు ఆన్‌లైన్‌కే ప్రాధాన్యం ఇస్తే వారిని అనుమతించాలి

3) తలిదండ్రుల లిఖితపూర్వక అనుమతితోనే స్కూళ్లకు విద్యార్థులు వెళ్లాలి. ఆ పత్రాన్ని యాజమాన్యాలు తప్పనిసరిగా అడగాలి

4) హాజరుపై పెద్దగా పట్టింపు ఉండరాదు. తలిదండ్రుల సమ్మతే ముఖ్యం

5) స్థానిక అవసరాలకు తగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు విడిగా నిబంధనలు జారీచేయాలి. తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి

6) కాలేజీలు, ఉన్నతవిద్యాసంస్థలను తెరిచే అంశంపై విద్యాశాఖ, కేంద్ర హోంశాఖ చర్చించి తగిన తేదీ నిర్ణయిస్తాయి

7) అయితే పీహెచ్‌డీ విద్యార్థులకు, లాబరేటరీలున్న శాస్త్ర సాంకేతిక సంబంధ విద్యాకోర్సులకు సంబంధించిన పీజీ విద్యార్థులకు 15 నుంచి కాలేజీలు తెరవవచ్చు

8) వర్సిటీలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కూడా కేవలం పీహెచ్‌డీ, టెక్నికల్‌ కోర్సుల వారిని మాత్రమే అనుమతించాలి

9) కేంద్ర ప్రాయోజిత ఉన్నత విద్యాసంస్థలో ఆ సంస్థ అధిపతిదే తుది నిర్ణయం. ఇక్కడ కూడా రిసెర్చ్‌ స్కాలర్లు, ఎంఎస్సీ, బీటెక్‌, ఎంటెక్‌ విద్యార్థులకు మాత్రమే అనుమతి

10) సామాజిక, విద్యా, సాంస్కృతిక, మత, క్రీడా, వినోద, రాజకీయ కార్యక్రమాలకు ఇంతవరకూ 100 మందిని మాత్రమే అనుమతించాలన్న నిబంధన ఉంది. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పెంచుకోవచ్చు. అయితే కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

11) బహిరంగ ప్రదేశాల్లో సభలు, సమావేశాల్లో సామాజిక దూరం తప్పనిసరి. మాస్కులు, శానిటైజర్లు, థర్మల్‌ స్ర్కీనింగ్‌ నిబంధనలు పాటించాలి

12) కంటైన్‌మెంట్‌ జోన్లలో మాత్రం అక్టోబరు 31 దాకా ఖచ్చితమైన ఆంక్షలు కొనసాగుతాయి.

Updated Date - 2020-10-01T08:04:55+05:30 IST