కనీస వేతనాల కోసం ఉద్యమం
ABN , First Publish Date - 2022-08-14T06:08:43+05:30 IST
అసంఘటితరంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ప్రకటించక 15 సంవత్సరాలు అవుతోందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస వేతనాలు ప్రకటించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ గఫూర్ డిమాండ్ చేశారు.
మూడో వారం నుంచి కార్యాచరణ.. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గఫూర్
అనంతపురం కల్చరల్, ఆగస్టు 13: అసంఘటితరంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ప్రకటించక 15 సంవత్సరాలు అవుతోందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస వేతనాలు ప్రకటించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ గఫూర్ డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్రంలో ఈనెల మూడోవారం నుంచి సెప్టెంబరు మూడో వారం వరకు ఉద్యమ కార్యాచరణ అమలు చేస్తామని తెలిపారు. నగరంలోని గణేనాయక్భవనలో ‘దేశ స్వాతంత్ర్యోద్యమంలో కార్మికుల పాత్ర, కార్మిక చట్టాల మార్పు, లేబర్ కోడ్స్ అమలు’ అనే అంశాలపై శనివారం నిర్వహించిన సదస్సులో గఫూర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అసంఘటిరంగ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగనకు అనేకమార్లు వినతిపత్రాలు సమర్పించామని అన్నారు. కమిటీని నియమించి, కనీస వేతనాలు ప్రకటిస్తామని సీఎం ఇచ్చిన హామీ ఇంతవరకూ నెరవేరలేదని అన్నారు. పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడు, కేరళలో అక్కడి ప్రభుత్వాలు కనీస వేతనాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. కనీస వేతనం ప్రకటించనందున రాష్ట్రంలో కార్మికులు ఏరకంగా నష్టపోతున్నారో చెప్పడానికి హిందూపురం గార్మెంట్స్ పరిశ్రమలే చక్కటి ఉదాహరణ అని అన్నారు. గార్మెంట్స్లో పనిచేసే వేలాదిమంది మహిళా కార్మికులకు వేతనం రూ.7 వేలలోపే ఉందని అన్నారు. అక్కడి నుంచి మూడుకిలోమీటర్ల దూరంలో గల కర్ణాటకలో రూ.15వేలు వేతనం అందుతోందని వివరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని తెలిపారు. ఈ నెల మూడోవారం నుంచి కార్మికులందరినీ కలిసి సంతకాలు సేకరిస్తామని, సెప్టెంబరు మూడో వారంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిరసన తెలుపుతామని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు నాగమణి, ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్, శ్రీసత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేష్, నాయకులు గోపాల్, బాబు, అచ్యుత, రమేష్ పాల్గొన్నారు.